భార్యను చంపి ఇంట్లో పూడ్చి పెట్టాడు: వీధికుక్కలు ఛేదించాయి
తన భార్యను చంపి ఇంట్లో పూడ్చి పెట్టి డ్రామాలు ఆడుతూ వచ్చిన వ్యక్తి గుట్టు రట్టయింది. వీధికుక్కలే ఆ మిస్టరీని ఛేదించాయి.
కర్నూలు: తన భార్యను చంపి ఇంట్లో పూడ్చి పెట్టి డ్రామాలు ఆడుతూ వచ్చిన వ్యక్తి గుట్టు రట్టయింది. వీధికుక్కలే ఆ మిస్టరీని ఛేదించాయి. కర్నూలు జిల్లాలోని వైఎస్ఆర్ నగర్లోని బాపయ్య భార్య శిరసాల లక్ష్మీదేవి హత్య కేసు అలా వెలుగులోకి వచ్చింది.
బాపయ్య అనే వ్యక్తి నిర్మిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించడంతో గుట్టు బయటపడింది. మృతదేహం ఛాయలు కన్పించడంతో తవ్వి శవాన్ని బయటకు తీశారు. మృతురాలి మెడలోని గొలుసు, ఎముకలు, పుర్రె బయటపడ్డాయి.
భార్య లక్ష్మీదేవిని రెండు నెలల క్రితం హత్య చేసిన బాపయ్య ఇంట్లోనే శవాన్ని పూడ్చి పెట్టి అమాయకుడిలా నటించాడు. తన భార్య కనిపించడం లేదని మామ జంబయ్యకు చెప్పడంతో ఆయన రెండు నెలల క్రితం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రెండు నెలలుగా...
లక్ష్మీదేవి మిస్సిగ్ కేసును రెండు నెలలుగా ఛేదించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ఏ విధమైన క్లూస్ దొరకలేదు. భార్య కనిపించడం లేదని తాను కూడా ఆమె కోసం గాలిస్తున్నట్లు బాపయ్య నటిస్తూ వచ్చాడు మామ దృష్టిలో మంచివాడిగా గుర్తింపు పొందాడు. దీంతో పోలీసులకు అనుమానం రాలేదు.
వీధి కుక్కలు ఇలా చేధించాయి
రెండు రోజుల క్రితం వీధి కుక్కలు మృతదేహాన్ని పూడ్చిన స్థలంలో గుంత తీశాయి. దాంతో ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడం ప్రారంభించింది. దానిపై ఇరుగుపొరుగు ఇళ్ల వారు వెళ్ళి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగప్రవేశం చేసి చివరకు మంగళవారం మృతురాలి ఎముకలను బయటకు తీశారు.
డీఎన్ఏ పరీక్షకు ఎముకలు
మృతురాలి ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు డీఎన్ఏ పరీక్షల నిమిత్తం కర్నూలుకు పంపారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి భర్త బాపయ్య సోమవారం నుంచి కన్పించడం లేదు. అసలు విషయం బయటపడడంతో అతను పారిపోయినట్లు భావిస్తున్నారు.
అతని కోసం గాలింపు....
పోలీసులు నిందితుడు బాపయ్య కోసం గాలిస్తున్నారు. మృతురాలు లక్ష్మీదేవి తండ్రి జంబయ్య ఫిర్యాదు మేరకు బాపయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.