మహారాష్ట్రలో హైదరాబాద్ యువ ఇంజినీర్ ఆత్మహత్య
పుణె: మహారాష్ట్రలోని పుణెలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన రుషికుమార్ శర్మ(25) అనే యువ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిగ్దిలోని యమునానగర్లోని తన ఇంట్లోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
తన మరణానికి ఎవరూ కారణం కాదని రుషికుమార్ శర్మ, తను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. నిగ్ది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి వరకు తన స్నేహితులతో మాట్లాడిన రుషికుమార్, ఆ తర్వాత తన గదిలోనే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం తెల్లవారినా గది నుంచి బయటికి రాకపోవడంతో అతని స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గది తలుపులు పగలగొట్టిన రుషికుమార్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రుషికుమార్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
గదిలో పరిశీలించగా సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులకు రాసినట్లుగా ఉందని చెప్పారు. జీవితంపై విరికి చెంది తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రుషికుమార్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
బీటెక్ పూర్తి చేసిన రుషికుమార్ గత మూడేళ్లుగా పుణెలోనే ఉంటున్నాడని చెప్పారు. మంచి జీతంతో ఓ ప్రైవేటు కంపెనీలో టెస్టింగ్ ఇంజినీరింగ్గా పని చేస్తున్నాడని తెలిపారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అతనికి ఆర్థిక ఇబ్బదులు కూడా ఏమీ లేవని చెప్పారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆత్మహత్యేనని తేలిందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.