దేశంలో ఉత్తమ నగరం హైదరాబాద్: తర్వాతే ఢిల్లీ, ముంబై, బెంగళూరు..
న్యూఢిల్లీ: విశ్వనగరంగా దూసుకుపోతున్న మన భాగ్యనగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. మన దేశంలో మెరుగ్గా జీవించేందుకు అత్యుత్తమమైన నగరం హైదరాబాద్ అని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టు-2015 ప్రకటించింది. ఏటా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ పేరిట సర్వేను నిర్వహిస్తుంటుంది.
మెర్సెర్ సంస్థ చేపట్టిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2015లో హైదరాబాద్ నగరం ప్రపంచస్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో ఇది తొలిస్థానం. విశ్వవ్యాప్తంగా మొత్తం 440నగరాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ప్రపంచస్థాయిలో మొదటిస్థానాన్ని ఆస్ట్రేలియాలోని వియన్నా, రెండో స్థానాన్ని స్విట్జర్లాండ్లోని జూరిచ్, తర్వాతిస్థానాల్లో న్యూజిలాండ్లోని ఆక్లాండ్, జర్మనీలోని మూనిచ్, కెనడాలోని వాంకోవర్ నగరాలు నిలిచాయి. అట్టుడుగు స్థానంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఉంది.
ప్రపంచస్థాయిలో హైదరాబాద్ 138వ స్థానంలో ఉండగా పుణె 145, బెంగళూరు 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్కతా 160 స్థానాల్లో నిలిచాయి. పక్క దేశాలైన శ్రీలంకలోని కొలంబో 132వ స్థానాన్ని, బంగ్లాదేశ్లోని ఢాకా 211వ స్థానాన్ని, పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ 202వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆసియాలో 26వ ర్యాంకుతో సింగపూర్ మొదటిస్థానంలో నిలిచింది.
హైదరాబాద్లో ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సర్వేలో తేలింది. తాగేందుకు మంచినీరు, ఏ క్షణంలోనైనా వైద్యం, మంచి రోడ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, అత్యుత్తమ ఇంగ్లిష్ బోధించే పాఠశాలలు, నగరానికి 22 కిలోమీటర్ల దూరంలోనే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఎన్నో వసతులు ఉన్నాయని మెర్సెర్ పేర్కొంది.
భాగ్యనగరంలో భారీ జనాభా ఉన్నప్పటికీ తక్కువ కాలుష్యం ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. దేశంలో మంచి వాతావరణం హైదరాబాద్ సొంతమని వ్యాఖ్యానించింది. హైదరాబాద్ తర్వాత రెండోస్థానంలో పుణె, మూడోస్థానంలో బెంగళూరు, నాలుగో స్థానంలో చెన్నై, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో న్యూఢిల్లీ, ఏడో స్థానంలో కోల్కతా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై వంటి నగరాల్లో నానాటికీ కాలుష్యం పెరిగిపోతుండటం, వసతులు కరువవడం, మంచినీరు అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలతో అక్కడ ప్రజలు ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదని సర్వేలో తేలింది.