సీఎం కేసీఆర్ దారిలో మెట్రో రైలు మార్పు: భారం ఎంతో!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మెట్రో రైలు అలైన్మెంట్ మార్పుల విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అంగీకరించిందని, ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మెట్రో రైలు ఎండీ ఎన్వీవీఎస్ రెడ్డి శనివారం తెలిపారు.
ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న మూడు ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్పులు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీని కోరిందన్నారు. దానికి ఎల్ అండ్ టీ కూడా ఒప్పుకుందని తెలిపారు. అలైన్మెంట్ మార్పుతో ఎంత భారం పడనుందో అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఉండాలంటే మెట్రో వైభవంగా ఉండాలన్నారు.
కాగా, మెట్రో రైలు రూటు మార్పునకు ఎల్ అండ్ టీ కొద్ది రోజుల క్రితం అంగీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపాదనలకు ఆ సంస్థ అంగీకరించింది. అంతేకాకుండా, మెట్రో రైలు ప్రాజెక్టులపై తాము రాసిన లేఖలు మీడియాకు పొక్కడం వల్ల ఏర్పడిన ఇబ్బందులకు కేసీఆర్కు క్షమాపణలు చెప్పింది.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు దెబ్బతినకుండా, రైలు రూటు మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్అండ్టీ అంగీకరించింది. రూటు మార్పునకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. రూటు మార్పు వల్ల శాసనసభ ముందు, సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలు వెళ్లదు. పాతబస్తీలోనూ కొన్ని మార్పులు జరగనున్నాయి.
అసెంబ్లీ భవనానికి చాలా చరిత్ర ఉందని, దాని ముందున్న అమరవీరుల స్థూపంతో తమకు భావోద్వేగ సంబంధం ఉందని, అందువల్ల అసెంబ్లీ ముందు నుంచి కాకుండా, వెనుకవైపు నుంచి లైను వేయాలని కెసిఆర్ తెలిపారు.
సుల్తాన్ బజార్కు కూడా ఎంతో చరిత్ర ఉందని, ప్రస్తుతం ఉన్నఅలైన్మెంట్ మార్చి కోఠి ఉమెన్స్ కాలేజీ వెనుక నుంచి రైలుమార్గం వేయాలని సూచించారు. పాతబస్తీలో వేసే లైన్ను అక్కడి ప్రసిద్ధ ప్రార్థనా మందిరాల ముందు నుంచి కాకుండా అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరినట్లుగా మార్చాలని చెప్పారు. ఈ మూడు ప్రతిపాదనలకు ఎల్అండ్టీ యాజమాన్యం అంగీకరించింది.