బాబు గెలవాలనుకున్నా.. నాది తప్పు, జగన్పై కేసు పెట్టండి: ఉండవల్లి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన పైన నేను పెట్టుకున్న నమ్మకం, ఆలోచనలు తప్పని నిరూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బాక్సైట్ తవ్వకాల అంశం విషయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు గెలవాలని తాను మనస్ఫూర్తిగా గెలవాలనుకున్నానని చెప్పారు.
విభజన నేపథ్యంలో, రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని, కాబట్టి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రి కావాలని తాను భావించానని చెప్పారు. ఏపీని చంద్రబాబు తీర్చిదుద్దుతాడని, అనుకున్నది సాధిస్తాడనుకున్నానని చెప్పారు.
తాను ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని సమర్థించలేదన్నారు. కానీ 2014 కౌంటింగ్ జరుగుతున్న సమయంలో తాను మనస్ఫూర్తిగా చంద్రబాబు గెలవాలనుకున్నానని చెప్పారు. కానీ ఈ రోజు పరిపాలనను చూస్తూంటే.. చంద్రబాబును సమర్థించడం తప్పుగా భావిస్తున్నానని చెప్పారు.
చంద్రబాబు నిత్యం కోట ఎలా కట్టాలా అనే చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి జిల్లాల వారు ఎప్పుడూ ఏదీ అడగరని చెప్పారని, దాంతో ఆయన తమను మెచ్చుకుంటున్నారని అనుకున్నానని చెప్పారు.
గోదావరి జిల్లా వాసులు స్థిరచిత్తులు అని, నమస్కారం పెట్టి భగవద్గీతను చదువుకుంటారన్నారు. కానీ జూలైలో పుష్కరాల సమయంలో 32 మంది చనిపోతే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. తన ఆలోచనలు తప్పని చంద్రబాబు నిరూపిస్తున్నారన్నారు.
బాక్సైట్ తవ్వకాలు విషయమై ఉండవల్లి మాట్లాడుతూ... చంద్రబాబు శ్వేతపత్రాలు అవాస్తవాలన్నారు. శ్వేతపత్రంపై జగన్ పార్టీ మాట్లాడితే ఎదురు దాడికి దిగడం ఎంత వరకు సమంజసమన్నారు.
మంత్రి యనమల రామకృష్ణుడుతో చంద్రబాబు అబద్దాలు చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలతో శ్వేతపత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వాటిపై చర్చ పెట్టాలన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఇలాగే చేసేవారని తెలిపారు.
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం, ఆ తర్వాత గిరిజనుల నిరసనతో వెనకడుగు వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాక్సైట్ గనుల వ్యవహారంలో ప్రభుత్వ తీరు వాస్తవాలు దాస్తున్నట్లుగా ఉందన్నారు. కేబినెట్లోని కొందరు మంత్రులు ఆరోపిస్తున్నట్లు బాక్సైట్ కంపెనీల బినామీగా వైసిపి అధినేత జగన్ ఉన్నట్లైతే, ఆయనపై తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చేసింది చెప్పకుండా జగన్పై ఆరోపణలా అన్నారు.