వనజాక్షిపై దాడి ఘటన: విచారణాధికారిగా జెసి శర్మ, నెలలో నివేదిక
విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనపై ఐఎఎస్ అధికారి జెసి శర్మ విచారించనున్నారు. ఈ ఘటనలో విచరణాధికారిగా ఆయనను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ జరిపి నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వం సూచించింది.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు వనజాక్షిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించారు.
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది.
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ సంఘాలు వనజాక్షికి అండగా నిలిచాయి. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సంఘాలతో చర్చించారు. వనజాక్షి పైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో శర్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది.