బాబు భేటీ: పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు వెళ్తానన్న గవర్నర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తే రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తానని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాదులో తన బాధ్యతలను గవర్నర్ సరిగా నిర్వహించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు.
కాగా, గవర్నర్ సోమవారం హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను, హోం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రేపు రక్షణ శాఖ మంత్రిని కలుస్తానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు.
వర్షాలు సరిగా కురువకపోవడం వల్లనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్తు ఉద్యోగుల అంశం త్వరలో కొలిక్కి వస్తుందని చెప్పారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సహా ఇతర శాసనసభ్యుల వ్యవహారం స్పీకర్ పరిధిలోదని ఆయన చెప్పారు.
రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ గంటన్నర పాటు సమావేశమయ్యారు. సోమవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో ఉండడం గమనార్హం. గవర్నర్ నరసింహన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎపి రాజధాని అమరావతికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది.