సుజనా చౌదరిని పక్కన పెడతారా: లోకేష్ కోసం ఎవరికి చెక్? రేసులో వెంకయ్య
విజయవాడ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయనకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని టిడిపి యువ నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు లేదా ఏపీలో మండలికి పంపించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మండలికి పంపిస్తే తెలంగాణలో లోకేష్ పర్యటించేందుకు ఇబ్బందులు వస్తాయని, కాబట్టి రాజ్యసభకు పంపించడం ద్వారా తెలంగాణలోను పార్టీ బలోపేతానికి నారా లోకేష్ కృషి చేయవచ్చునని కొందరు సూచిస్తున్న విషయం తెలిసిందే.
రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లలో మూడు సీట్లు కేటాయించే అవకాశముంది. ఒక సీటును కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో నాలుగు సీట్లలో టిడిపికి మూడు దక్కనున్నాయి.
అందులో ఓ సీటు ఎస్సీలకు, మరో సీటు బీసీలకు వెళ్లిపోనుంది. దీంతో టిడిపికి మరో ఒక్క సీటు మాత్రమే మిగలనుంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం జూన్ నాటికి ముగియనుంది.
నారా లోకేష్కు కనుక అవకాశమిస్తే.. మరోసారి సుజన రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ జరగకపోవచ్చునంటున్నారు. అయితే, చంద్రబాబు.. సుజనను అంత సులభంగా పక్కన పెడతారా అనే విషయం తెలియాల్సి ఉంది. దానికి సుజన కూడా సరేనని చెబుతారా చూడాలి.
మరోవైపు, ఇప్పటికే చంద్రబాబు వారసుడు నారా లోకేష్ అని తేలిపోయింది. గతంలో రాజకీయ వారసుడిగా హీరో జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి వచ్చారు. కానీ లోకేష్కు పార్టీలో బాధ్యతలు అప్పగించడంతోనే అది వారసత్వంపై తేలిపోయింది. ఇప్పుడు రాజ్యసభకు పంపించడం ద్వారా మరో ముందడుగు వేసినట్లవుతుందని భావిస్తున్నారంటున్నారు.
కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షాతో రాజ్యసభ విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది. నాలుగు సీట్లలో బిజెపికి ఒకటి, టిడిపికి మూడు వెళ్లనున్నాయి. బిజెపి నుంచి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో పాటు మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేసులో ఉన్నారు.