'వేస్ట్ మేనేజ్మెంట్ సైట్' సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్: జపాన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. మూడో రోజైన ఈరోజు వాటర్గ్రిడ్ మేనేజ్మెంట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం శాన్ నో స్టార్మ్ రిజర్వాయర్ను సందర్శించారు.
వరద నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటు నకాటా వేస్ట్ మేనేజ్మెంట్ సైట్ను సందర్శించారు. వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలను బాబుకు జపాన్ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో 13 స్మార్ట్ సిటీలలో వేస్ట్ మేనేజ్మెంట్ను అమలు చేస్తామన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో జపాన్ అనుసరించిన విధానం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు జపాన్లో ఫికాకో టవర్ను సందర్శించారు. ఆ తరువాత సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన బాబు అక్కడి రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ సహకారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్యూకోకా నగర డిప్యూటీ గవర్నర్, డిప్యూటీ మేయర్ ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో తాము కూడా పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్యూకోకా నగర డిప్యూటీ మేయర్ అత్యుహితో ఈ సమావేశంలో చెప్పారు.