బాబు ఆస్తులపై వ్యాఖ్య బాధాకరం: రాజప్ప, మరో 7 నెలల 23 రోజులే: కాపులకు నారాయణ
రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా తన ఆస్తులను ప్రకటిస్తున్నారని, తన ఆస్తుల విషయంలో సీఎం పారదర్శకత పాటిస్తున్నారని, అలాంటప్పుడు ఆయన పైన రూ.2 లక్షల కోట్లు అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించడం తగదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు.
ఆయన ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఆస్తుల గురించి ముద్రగడ వ్యాఖ్యలు శోచనీయమన్నారు. చంద్రబాబు తన ఆస్తుల విషయంలో పారదర్శకత పాటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పైన తీవ్ర వ్యాఖ్యలతో కాపులకు న్యాయం జరుగుతుందనుకోవడం అవివేకమన్నారు. అనవసర ఆరోపణలు వద్దన్నారు.
కాపులను బీసీలలో చేర్చడం, వారికి న్యాయం చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. కాపులకు న్యాయం చేసే దిశలో చంద్రబాబు అడుగులు వేస్తున్నారనే విషయాన్ని కాపులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాపు జాతి పట్ల చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి ఇప్పటికే కాపుల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేశారని, బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథన్ కమిటీ ఏర్పాటు చేశారని చినరాజప్ప చెప్పారు. తద్వారా కాపు జాతి పట్ల చంద్రబాబు తనకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఏడాది చంద్రబాబు తన ఆస్తులు ప్రకటిస్తున్నారన్నారు.
7 నెలల 23 రోజుల్లో నివేదిక: నారాయణ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిటి తొమ్మిది నెలల్లో కాపు రిజర్వేషన్ల పైన ఇస్తుందని మంత్రి నారాయణ అన్నారు. మరో ఏడు నెలల 23 రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు. దీనిపై రాద్దాంతం తగదన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించి ముద్రగడ తన దీక్షను విరించాలన్నారు.
కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని నారాయణ చెప్పారు. తక్షణమే దీక్ష విరమించాలని ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు ఏటా వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని మేం చెప్పామని, మా హామీలకు మేం కట్టుబడి ఉన్నామన్నారు.
కాపులకు న్యాయం చేయడానికి, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్ను నెల క్రితమే ఏర్పాటు చేశామన్నారు.
కమిషన్ కాల పరిమితిని తొమ్మిది నెలలుగా నిర్ణయించామని, ఇప్పటికే ఒక నెల 7 రోజుల సమయం గడిచిపోయిందని, మరో 7 నెలల 23 రోజుల్లో కమిషన్ నివేదిక రానుందని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు ఆ మాత్రం సమయం అవసరమేనని, ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి దయచేసి దీక్ష విరమించాలన్నారు.