అలా జరిగితే ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండదు
తిరుపతి: పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ ను వ్యూహాత్మకంగా విజయవంతం చేసిందని, ఆ సత్తా భారత్ కు ఉందని భారత మాజీ లెఫ్ట్ నెంట్ జనరల్ ఏఆర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతిలో ఓ ప్రయివేట్ టీవీ చానెల్ తో మాట్లాడారు.
సర్జికల్ స్ట్రైక్ దాడికి 10 ఏళ్లుగా సేకరించిన సమాచారం ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ఉరీ ఉగ్రదాడి తరువాత ఆలస్యం అయినా భారత్ పాక్ కు సరైన బుద్ది చెప్పిందని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని ఏఆర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాక్ తో యుద్ధం వచ్చినా భారతీయులు భయపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. మన సైనిక దళాలు యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొంటాయని ఆయన చెప్పారు. పాకిస్థాన్ అణు అస్త్రాలు ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడుతుందని, అలాంటిది ఏదీ జరగదని అన్నారు.
అణు అస్త్రాలు ప్రయోగించడం మాటలు చెప్పినంత సులువుకాదని ఏఆర్ రెడ్డి చెప్పారు. అదే జరిగితే ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనపడదని జోస్యం చెప్పారు. బుధవారం అర్దరాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి 38 మంది ఉగ్రవాదులను అంతం చేసిన విషయం తెలిసిందే.