ముద్రగడ ఇంటిపై నిఘా: వైద్య పరీక్షలకు నిరాకరణ, అనుచరుల్లో ఆందోళన
కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్తో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మాంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణితో కలిసి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఆయన తన సతీమణితో కలిసి దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటి తలుపులు బిగించుకుని లోపల నిద్రపోయిన ముద్రగడ దంపతులు ఈరోజు ఉదయం నుంచి మళ్లీ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ముద్రగడతో పాటు ఆయన సతీమణికి కూడా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ముద్రగడ సతీమణి పద్మావతికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చక్కెర నిల్వలు స్థాయిలు పడిపోయాయని తెలిపారు. అయితే ముద్రగడ ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు వద్దని నిరాకరిస్తున్నారు. దీంతో పెద్దాపురం ఆర్టీవో ముద్రగడను ఆరోగ్య పరీక్షలు చేయించకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
దీంతో కిర్లంపూడిలో ముద్రగడ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ముద్రగడ ఇంటిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. ఆమరణ దీక్ష సమయంలో ముద్రగడ ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నారో మప్టీలో ఉన్న పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ముద్రగడ అనచరులతో పాటు కలిసిపోయి ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు.
కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి చుట్టూ మప్టీలో పొలీసులు ఉన్నారు. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు గాను కిర్లంపూడికి చేరుకున్న మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీరామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ పోలీసులతో వాగ్వాదానిగి దిగారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి తనతో చర్చలు జరిపేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కొన్ని ప్రతిపాదనలు చేశారని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆ ప్రతిపాదనలకు తాను కొన్ని సవరణలు సూచించానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రితో మాట్లాడి మరోసారి వస్తానని భాస్కరరామారావు చెప్పారని వివరించారు. నా ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారని అన్నారు. ఒకవేళ సీఎం నుంచి సానుకూల స్పందన రాకుండే తన దీక్ష కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు.
తమ జాతికి న్యాయం జరుగుతుందంటే దేనికైనా సిద్ధమేనని ముద్రగడ ఉద్ఘాటించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులేదని చెప్పడం అవాస్తమని అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వని వాటికి డబ్బులు ఉంటాయి గానీ, హామీలు ఇచ్చిన వాటని నెరవేర్చడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పడం కరెక్ట్ కాదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదన్నారు.
ముద్రగడ దీక్ష రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అమలాపురంలోని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా కాపు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
మచిలీపట్నంలో మిరియాల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంటా సురేష్ తన మద్ధతుదారులతో కలిసి బందరు నాయారుబడ్దీ సెంటరులోని కాపునాడు కార్యాలయంలో శనివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముద్రగడ దీక్ష కొనసాగెంతవరకు తాము దీక్ష చేస్తామని తెలిపారు.
దీక్షకు మద్దతుగా బందరు చిలకలపూడి సెంటర్లో వివిధ పార్టీల కాపు సంఘ నాయకులు, మహిళలు కంచాలు పట్టుకొని తమ నిరసన తెలిపారు. కాపు యువకులు బందరు పట్టణంలో బైకు రాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమణాకుమార్, రంగనాథ్, రఘు, శేషయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.