అభివృద్ది-అభిమానం: నంద్యాల పోరులో దేని తూకం ఎక్కువ?, జగన్ కూడా అదే అస్త్రంతో..
అభివృద్దికి ఓటేస్తామని టీడీపీ మద్దతుదారులు చెబుతుంటే.. తమ అభిమాన నేతకే ఓటేస్తామంటూ జగన్ అభిమానులు చెబుతుండటం గమనార్హం.
కర్నూలు: అభివృద్దికి ప్రత్యామ్నాయంగా తన పేరును మలుచుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు సఫలమయ్యారు. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ ఆ విశ్వాసాన్ని జనంలో పెంపొందించుకున్నారు కాబట్టే.. పదేళ్ల విరామం తర్వాత గత ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు కూడా అదే అభివృద్ది మంత్రాన్ని జపిస్తూ జనంలోకి వెళ్తున్నారు. నంద్యాల ఉపఎన్నికలోను ఇదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికను దృష్టిలో పెట్టుకునే అభివృద్దిని కూడా ఓ ప్రలోభంగా వాడుకుంటుందన్న విమర్శ టీడీపీపై ఉన్నప్పటికీ.. ప్రజలను ఆకర్షించడానికి ఇంతకంటే మెరుగైన అస్త్రమేది లేదని ఆ పార్టీ భావిస్తోంది. అందువల్లే దాదాపు 1,400 కోట్లను నంద్యాల అభివృద్ధి పనుల కోసం కేటాయించింది.
అధికారం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనేలా?:
అధికార పార్టీలతోనే అఅభివృద్ధి జరుగుతుందనే ప్రచారాన్ని రాజకీయ పార్టీలు ఈమధ్య కాలంలో జనంలోకి బాగా తీసుకెళ్తున్నాయి. పార్టీ మారుతున్న నేతలు కూడా అభివృద్ధిని చూసే వెళ్తున్నామని దాన్నో సాకులా చెప్పుకొస్తున్నారు. దీంతో అధికార పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందన్న అనివార్యమైన ఆలోచనను నాయకులు జనానికి కల్పిస్తున్నారు. తద్వారా రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికలోను ఇదే జరుగుతోందని చెప్పవచ్చు.
Recommended Video
జగన్ కూడా అదే అస్త్రంతో:
అభివృద్ధి.. అభివృద్ధి అని టీడీపీ ప్రజల్లోకి వెళ్తుండటంతో.. వైసీపీ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించక తప్పలేదు. అందుకే 'అభివృద్ధిని నాకు వదిలేయండి..' అంటూ జగన్ నంద్యాల జనానికి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. అంతేనా.. భవిష్యత్తులో నంద్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తామంటూ శిల్పా చక్రపాణి మరో హామి కూడా ఇచ్చేశారు.
జగన్-చంద్రబాబు ఇద్దరూ అభివృద్ధి మంత్రాన్నే జపిస్తున్నప్పటికీ.. ఇప్పటికే బాబు ఆ పేరుతో గుర్తింపు పొందడంతో.. అభివృద్ధి అంటే జనానికి ఆయనే కనిపిస్తున్నారన్న వాదన ఉంది. టీడీపీ మద్దతుదారులు, అనుకూల వర్గాలు నంద్యాలలో ఈ తరహా ప్రచారాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లగలుగుతున్నాయి. అందుకే కొన్ని టీవీ చానెల్స్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో.. 'అభివృద్ధికే మా ఓటు అని' పలువురు అభిప్రాయపడటం కనిపించింది.
అభివృద్ది వర్సెస్ అభిమానం:
అభివృద్దికి ఓటేస్తామని టీడీపీ మద్దతుదారులు చెబుతుంటే.. తమ అభిమాన నేతకే ఓటేస్తామంటూ జగన్ అభిమానులు చెబుతుండటం గమనార్హం. ఒకరకంగా ఈ ఎన్నికను అభివృద్ది వర్సెస్ అభిమానం అని చర్చించుకునేలా చేశారు.
అభివృద్దికి తానే పేటెంట్ అయినట్లు దానిపై చంద్రబాబు మార్క్ బలంగా పడిపోవడవంతో.. జనంలో నుంచి దాన్ని పెకిలించడం కాస్త కష్టమనే చెప్పాలి. అందుకే తమ అభిమాన నేతకు ఓటేసి అసలైన అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు జగన్ మద్దతుదారులు.
ఇద్దరికీ కలవరమే:
ఓటేసి గెలిపించిన నేత అదే పార్టీలో కొనసాగుతాడన్న గ్యారంటీ లేదు కాబట్టి జనం ఏ పార్టీని నమ్ముతారు.. ఎవరి వల్ల నిజమైన అభివృద్ది సాధ్యపడుతుందని వారు భావిస్తారన్న దాని పైనే నంద్యాల ఫలితం ఆధారపడి ఉంది. ప్రచార పర్వంలో జోరుగా ప్రచారం చేసినప్పటికీ.. ఇరు పార్టీలు ప్రజా నిర్ణయంపై కలవరంతోనే ఉన్నాయి.
ముస్లిం సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉండటంతో మాజీ మంత్రి ఫరూక్కు ఎమ్మెల్సీ కట్టబెట్టడం టీడీపీకి ఎన్ని మైనారిటీ ఓట్లను తీసుకొస్తుందనేది ఆ పార్టీ గెలుపోటముల్లో కీలకంగా మారుతుంది. అభివృద్ది విషయంలో జనం పాత విశ్వాసాలకే ఓటు కట్టబెడుతారా? ప్రత్యామ్నాయంగా జగన్ను ఎంచుకుంటారా? అన్నది కూడా కీలకమే. శిల్పాను లోకల్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తుండటం ఎంతమేర కలిసొస్తుందనేది చూడాలి.