జగన్ వర్సెస్ పవన్ : ఏపీలో రసవత్తర పాలిటిక్స్.. అసలేం జరుగుతోంది!
విజయవాడ : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓవైపు జనసేన యాక్టివ్ అవడం.. మరోవైపు జనాల్లోకి చొచ్చుకెళ్లేందుకు వైసీపీ శతవిధాల ప్రయత్నిస్తుండడం.. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రత్యేక హోదా అస్త్రాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకోవాలని చూస్తుండడం వంటి అంశాలు ఏపీ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ముఖ్యంగా.. మొన్నటి కాకినాడ సభ సందర్బంగా.. కలిసొచ్చే పార్టీలతో కలిసి హోదాపై పోరాడుతాం.. అన్న పవన్ వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఏపీ జనం. హోదా కోసం ఎంపీలు రాజీనామా చేసి రోడ్డెక్కితే.. వారిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని ఆ సభలో పవన్ చెప్పారు.
ఇప్పుడా సందర్బం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. నిన్నటి కర్నూలు యువభేరీ సభలో.. హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి సిద్దం అని జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఒకవేళ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. పవన్ వారికి మద్దతునిస్తారా..? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకైతే పవన్ వైసీపీకి ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరించలేదు. పైగా.. హోదా కోసం ప్రతిపక్షాలతో కలిసి వైసీపీ ఇచ్చిన బంద్ కు ప్రతికూలంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితుల నడుమ.. ఇప్పుడు అనంతపురంలో మూడో సభకు ప్లాన్ చేశారు పవన్. అదీ హోదా కోసం. ఇటు వైసీపీ కూడా హోదాపై ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తోంది. దీంతో హోదా కోసమైనా పవన్ వైసీపీ మాటెత్తుతారా! లేక ఎప్పటిలాగే ప్రభుత్వాన్నే వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది వేచి చూడాలి.
జనసేన బలోపేతానికి.. వైసీపీ ప్రతిపక్ష ఉనికికి..
జనసేన పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో .. ప్రతిపక్షం తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు భవిష్యత్తు రాజకీయాలను ద్రుష్టిలో ఉంచుకుని.. పార్టీ బలోపేతానికి జనసేన కూడా నడుం బిగించినట్లే కనిపిస్తోంది. కాగా, ఇందుకోసం ఇప్పుడు ఈ రెండు పార్టీల ముందున్న ప్రధాన అస్త్రం ప్రత్యేక హోదానే.
హోదాపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంటే.. జనసేన మాత్రం ప్రభుత్వంతో పూర్తిగా విబేధించకుండానే ఇప్పటిదాకా బండి లాగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల ప్రధాన అస్త్రం ఒక్కటే కావడంతో.. భవిష్యత్తులో వీరి పోరాట మార్గాలు ఎలా ఉంటాయన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.