జగన్ లో మార్పు! ప్రతికూల మీడియాను ఎదుర్కోబోతున్నారా..!?
హైదరాబాద్ : 'తన స్థాయికి తగ్గ నేతలతోనే మాట్లాడుతారు.. పార్టీ నేతలతో సంబంధం లేకుండా తన నిర్ణయానికే జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.. ఆఖరికి ఎవరైనా కలవాలనుకున్నా సరే.. సెలక్టెడ్ పీపుల్ కే జగన్ ఆ అవకాశమిస్తారు..' ఇందులో నిజానిజాల స్థాయి ఎంతన్నది తెలియదు గానీ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి జనంలో ఉన్న ఒక వాదన ఇది.
ఒక నాయకుడిగా తనకంటూ కొన్ని పరిధులు గీసుకున్న జగన్.. మీడియా విషయంలోను చాలా పరిమితులకు లోబడి ఉన్నారు. ఒకవిధంగా ఆయన మీడియా వ్యవహారాలన్ని సొంత మీడియా సాక్షికే పరిమితం. తాజాగా ఎన్నారై తెలుగువాళ్లతో జగన్ సంభాషణ కూడా సాక్షి ద్వారానే జరిగింది. అయితే ఎప్పుడూ మీడియా కార్యక్రమాల్లో కంటపడని జగన్, ఇకనుంచి ఆ పరిధులను చెరిపేసుకుంటున్నారన్న వాదనకు ఇది ఊతమిస్తోంది.
మామూలుగానే మీడియా కార్యక్రమాలకు జగన్ చాలా దూరం. అలాంటిది జగన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం.. ఆయన వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు చూపిస్తోందంటున్నారు పలువురు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ఈరోజుల్లో ఏ నాయకుడికైనా మీడియా అనేది ప్రధాన ఆయుధం. ఈ విషయంలో టీడీపీ మీడియా మేనేజ్ మెంట్ ముందు మిగతా పార్టీలు తేలిపోవాల్సిందే. ఒకరకంగా జగన్ సాక్షికి తప్ప మిగతా మీడియాకు దూరంగా ఉండడానికి కూడా అదే కారణం.
తిమ్మిని బమ్మి చేసే టీడీపీ మీడియా మేనేజ్ మెంట్ ను జగన్ సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారన్న వాదన కూడా ఉంది. అందుకే ముఖాముఖి ఇంటర్వ్యూల్లో ఆయనెప్పుడూ కనిపించలేదు కూడా. అయితే ప్రవాస తెలుగువాళ్లతో సంభాషణ ద్వారా.. రానున్న రోజుల్లో తనకు ప్రతికూలంగా ఉన్న మీడియాను సైతం జగన్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారా.. అన్న చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తనపై ఉన్న ఆరోపణలను.. విమర్శలను.. తన ప్రతికూల మీడియా ద్వారానే జగన్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తే.. వచ్చే ఎన్నికల నాటికైనా జనంలో పార్టీ పొలిటికల్ మైలేజ్ పెరగవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అదే విధంగా.. ఏకపక్ష నిర్ణయాలకు కట్టుబడి కాకుండా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరిని కలుపుకునిపోయే రీతిలో జగన్ తన రాజకీయాలను మార్చుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. చూడాలి మరి.. తన ప్రతికూల మీడియాను సైతం జగన్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారా?.. సెలక్టెడ్ నేతలతోనే ఇంటరాక్ట్ అవడం పక్కనబెట్టి.. అందరిని కలుపుకుని రాజకీయ వ్యూహాలు రచిస్తారా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.