ఇంజనీరింగ్ అమ్మాయిపై ఇన్విజిలేటర్ అసభ్య ప్రవర్తన
అనంతపురం: అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇంజినీరింగ్ విద్యార్థిని పట్ల ఇన్విజిలేటర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి - నగర శివారులోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీనివాస రామాజనుజం ఇంజినీరింగ్ కళాశాల (ఎస్ఆర్ఐటి) విద్యార్థులు పరీక్షలు రాయడానికి కళాశాలకు వచ్చారు.
ఈ క్రమంలో పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థిని పట్ల అక్కడి ఇన్విజిలేటర్ లింగన్న అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు కళాశాల విద్యార్థులకు తెలిపింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన విద్యార్థిని తల్లిదండ్రులు, సహ విద్యార్థులు కళాశాల ఆవరణలో ధర్నాకు దిగడంతో పాటు కళాశాలపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కళాశాలలోని పలు గదులకు అమర్చిన అద్దాలు ధ్వంసం కాగా పరిస్థితి తీవ్రతను గుర్తించిన కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు చేరవేసింది.
అనంతపురం రూరల్ పోలీసులు ఇన్విజిలేటర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ విషయంపై బాధితురాలి నుంచి కానీ ఆ కళాశాల యాజమాన్యం నుంచి కానీ, అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు చెప్పారు. అయితే అక్కడ నిర్వహించే పరీక్షల్లో సదరు ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్గా వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
సంక్షోభంలో వున్న చేనేత పరిశ్రమ మరో నేతన్నను బలిగొన్న సంఘటన పట్టణంలోని గాంధీనగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ(33) అను చేనేత కార్మికుడు అప్పుల బాధ భరించలేక శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి రూ.1.50 లక్ష దాకా అప్పులున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వెంటనే టిడిపి జిల్లా చేనేత సెల్ అధ్యక్షులు ఉడుముల రామచంద్ర తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
వలస కూలీ మృతి
గుమ్మఘట్ట మండల పరిధిలోని జె.వెంకటాంపల్లి గ్రామంలో వలస కూలీ తిప్పేస్వామి (45) మృతి చెందాడు. అతడి భార్య శివమ్మ తెలిపిన వివరాలు.. తాము బతుకుదెరువు కోసం బెంగళూరుకు బయల్దేరామని, అయితే మార్గమధ్యలో నా భర్త ఉన్నట్టుండి బస్సులోనే మృతి చెందాడని బోరున విలపించింది. కాగా తిప్పేస్వామికి ఒక కుమారుడు ఉన్నారు.