హోదా టు రాజ్యసభ: టైం చూసి బాబుని దెబ్బకొట్టిన మోడీ, వెంకయ్య?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ గట్టి ఝలక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి రాజ్యసభ సీటును కేటాయించడం ద్వారా తాము కొన్ని డిమాండ్లను కమలం పార్టీ ముందు ఉంచుదామని చంద్రబాబు భావించారు.
కానీ, బీజేపీ వ్యూహాత్మకంగా చంద్రబాబుకు గట్టి ఝలక్ ఇచ్చింది. ఏపీలో టీడీపీ మూడు రాజ్యసభ స్థానాలు గెలవనుంది. ఒక దానిని బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉంది. అయితే, అందుకు గవర్నర్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు డిమాండ్ చేయాలని చంద్రబాబు భావించారు.
కానీ చంద్రబాబు ఆశలను బీజేపీ అడియాసలు చేసింది. వెంకయ్య నాయుడును రాజస్థాన్ నుంచి, నిర్మలా సీతారామన్ను కర్నాటక నుంచి మరోసారి రాజ్యసభకు పంపించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రస్తుతం వెంకయ్య కర్నాటక నుంచి, నిర్మల ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అడుగుతారనుకుంటే.. షాకిచ్చారు
రాజ్యసభ సీటు విషయమై తాము టిడిపితో చర్చలు జరుపుతున్నామని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే, టిడిపి నేతలు మాత్రం తమతో వారు సంప్రదింపులు జరపలేదన్నారు.
లోలోన మంతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ టీడీపీ నేతలు తమతో బీజేపీ ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పింది. దీంతో బీజేపీ ఏకంగా ఏపీ నుంచి రాజ్యసభకు పంపుదామనుకున్న నిర్మలను.. కర్నాటకకు మార్చింది. కర్నాటక నుంచి పంపిద్దామనుకున్న వెంకయ్యను రాజస్థాన్ నుంచి పంపిస్తోంది.
బీజేపీ - టీడీపీ మధ్య గ్యాప్ వచ్చేసినట్లేనా?
ప్రత్యేక హోదా నుంచి ఇప్పుడు రాజ్యసభ వరకు చూస్తుంటే టిడిపి - బీజేపీ మధ్య గ్యాప్ వచ్చినట్లుగానే కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
హోదా పైన టీడీపీ నేతలు గట్టిగా నిలదీయడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక.. టిడిపిని రాజ్యసభ అడగవద్దని నిర్ణయించుకున్నారా అనే చర్చ సాగుతోంది. నిన్న హోదాపై మాటల యుద్ధం, నేడు రాజ్యసభ విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం చూస్తుంటే.. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
గ్యాప్ కాకుంటే మరొకరికి ఛాన్సా?
ఏపీకి చెందిన బీజేపీ నేతలు, టిడిపి నేతల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం చూస్తుంటే గ్యాప్ కనిపిస్తోంది. అయితే, పార్టీల మధ్య మాత్రం ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. వెంకయ్యను రాజస్థాన్ నుంచి, నిర్మలను కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించడం ద్వారా ఏపీ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందా? అనే చర్చ కూడా సాగుతోంది.