నిన్న పవన్ నేడు బాలకృష్ణ: బాబు గుర్రు వెనుక.. జగన్ను టార్గెట్ చేశారా?
హైదరాబాద్: రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా తెలుగుదేశం పార్టీ నేతలు, విపక్ష కాంగ్రెస్, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే, కేంద్రం పైన ఏపీ అధికార పార్టీ ఆగ్రహం వ్యూహాత్మకమని పలువురు ఆరోపిస్తున్నారు.
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో ఈ బడ్జెట్ లేదని రాష్ట్ర నేతలు కేంద్రం పైన మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఇరవై వేల కోట్ల రూపాయల అంచనాలు ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించడం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల పైన మాట మాత్రం చెప్పక పోవడం ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ నిర్లక్ష్యం పైన అధికార టీడీపీ ముందే వ్యూహాత్మకంగా కేంద్రం పైన మాటల దాడికి దిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటి పైన తమను ప్రశ్నించే అవకాశం విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదని టీడీపీ ముందుగానే కేంద్రం పైన దుమ్మెత్తి పోస్తుండవచ్చునని పలువురు అనుమానిస్తున్నారు.
ఏపీలో, కేంద్రంలో బీజేపీ - టీడీపీలు పొత్తు కలిగి ఉన్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ఇరు పార్టీలు మంత్రివర్గంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పైన చేసే ప్రతి చర్యా టీడీపీకి తాకుతుంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం ప్రభావం తమ పైన పడకుండా ఉండేందుకు టీడీపీ బీజేపీ పైన దుమ్మెత్తి పోస్తోందని అంటున్నారు.
ఏపీ పైన కేంద్రం నిర్లక్ష్యం వహించిందని చంద్రబాబు అదే రోజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే అవసరమైతే కేబినెట్ నుండి బయటకు వద్దామని పార్టీ నేతల సమావేశంలో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మరుసటి రోజు బాలకృష్ణలు స్పందించారు. ఇక, మూడు రోజులుగా టీడీపీ నేతలు బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీజేపీపై టీడీపీ ఘాటు వ్యాఖ్యల వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కనుమరుగవుతున్నాయని అంటున్నారు. బడ్జెట్ పైన తాము స్పందించడం వల్ల.. జగన్కు అవకాశం ఇవ్వకుండా పోవడమే కాకుండా, ఆ పార్టీ నేతల విమర్శలు కూడా తెరపైకి అంతగా రావడం లేదని అంటున్నారు.