అమెరికాలో చంద్రబాబు సేల్స్బాయ్లా!.. అధ్యక్ష పదవికి పోటీనా అన్నారు: లోకేష్
'నేను మహా అయితే 20,30ఏళ్లు బతుకుతానని, నా కుటుంబానికి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదు.. నా కష్టం.. ఆలోచన అంతా మీ గురించే. రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తునివ్వాలి. ప్రతీ కుటుంబంలో సంతోషం చూడాలి.
అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం తన 7రోజుల అమెరికా టూర్ లో 7వేల కి.మీ తిరిగారని, ఒకవిధంగా 'సేల్స్ బాయ్' తరహాలో ఫైల్స్ చంకలో పెట్టుకుని ప్రతీ కంపెనీ మెట్లెక్కారని అన్నారు. సీఎం పర్యటన చూసి అక్కడివారంతా.. మీ సీఎం అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారా? అని ప్రశ్నించారంటూ లోకేష్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం 67ఏళ్ల వయసులోను సీఎం ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు.
పుత్తూరులోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ.. 2019లోగా తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్లేనని, గ్రామాల్లో తాము ఏర్పాటు చేయబోయే ఎల్ఈడీ లైట్ల వెలుతురు కిందే ప్రతిపక్షం వాళ్లు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుక్కుంటారని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే బెస్ట్ స్టేట్గా నిలుపుతా:
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలోనే 'ది బెస్ట్' స్టేట్ గా నిలుపుతానంటూ హామి ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
'నేను మహా అయితే 20,30ఏళ్లు బతుకుతానని, నా కుటుంబానికి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదు.. నా కష్టం.. ఆలోచన అంతా మీ గురించే. రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తునివ్వాలి. ప్రతీ కుటుంబంలో సంతోషం చూడాలి. అదే నా తపన' అని సీఎం చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని విజ్ఞానాన్ని అంతా మన రాష్ట్రానికే తీసుకొస్తానని, ప్రపంచంలోనే తిరుగులేని రాష్ట్రంగా ఏపీని నిలుపుతానని అన్నారు.
అభివృద్ధి, సంక్షేం రెండు కళ్లు:
మూడేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయి.. అప్పుల మూటతో అమరావతికి వచ్చినప్పుడు.. అందరిలోను భయం ఏర్పడిందన్నారు. కానీ వారి భయాన్ని పోగొట్టేలా.. రాష్ట్రాన్ని అప్పుల నుంచి గట్టెక్కించానని పేర్కొన్నారు. అప్పులున్నా, ఆర్థిక సమస్యలున్నా.. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని రీతిలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేం తనకు రెండు కళ్లు అన్నారు.
అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు సహాయం చేయాల్సిన అవసరముందని, ఇందుకోసం రూ.70కోట్లు కేటాయిస్తున్నామని సీఎం అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు సైతం విదేశాల్లో చదువుకునేందుకు సహాయం అందించనున్నట్లు తెలిపారు. చదువు తరగతి గదులకే పరిమితం కాకుండా.. ప్రాక్టికల్ నాలెడ్జి కూడా పెంచుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.
వినూత్నంగా ఆలోచించాలి:
సాధారణంగా అందరి లాగే ఆలోచిస్తే.. ఉద్యోగం వస్తుందని, కానీ వినూత్నంగా ఆలోచించగలిగితే పరిశ్రమలు పెట్టే స్థాయి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరుపై ఈ సందర్భంగా సీఎం విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ పిడుగు పడ్డ.. ఒక గంట ముందుగానే ప్రజల సెల్ ఫోన్లకు మెసేజ్ వెళ్తుందని, తద్వారా పిడుగుపడే ప్రాంతానికి వారు దూరంగా ఉండేలా అప్రమత్తమవుతారని అన్నారు.
సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాల్లో తాను ఎక్కువగా గడపనని, కానీ విద్యార్థుల కోసం ఇంత సమయం కేటాయిస్తున్నానని అన్నారు. ఇక్కడున్న 4500మంది విద్యార్థుల్లో 450మంది విద్యార్థులు తన స్పీచ్ వల్ల ప్రభావితమైనా.. లక్షల మందికి ఉపాధి కల్పించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.