డోంట్ టచ్ మీ అంటే బూతు మాటా? కేసులవుతున్నాయి: బిజెపి ఎమ్మెల్యే
హైదరాబాద్: డోంట్ టచ్ మీ అంటే బూతు మాటా అని ప్రశ్నిస్తూ అలా అన్నందుకే కేసులు నమోదవుతున్నాయని, అదృష్టవశాత్తు తనపై మాత్రం కేసు నమోదు కాలేదని బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావును కోరారు.
గురువారం శాసనసభలో విష్ణుకుమార్ రాజు ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ జీరో అవర్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల తాను తిరుపతి వెళ్లానని, అక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం క్యూలో నిలబడ్డానని, ఆ సమయంలో కొంత మంది తనను నెట్టేయడానికి ప్రయత్నించారని, దాంతో తాను డోంట్ టచ్ మీ అన్నానని, ఈ విషయంపై వివాదం చెలరేగిందని ఆయన వివరించారు.
అదేమైనా అసభ్యకరమైన పదమా, దుర్భాషణా అని ప్రశ్నించారు. అదృష్టవశాత్తు తతనపై కేసు నమోదు కాలేదని ఆయన చెప్పారు. విష్ణు కుమార్ రాజు లేవనెత్తిన అంశంపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పందించారు.
డోంట్ టచ్ మీ అనేది అసభ్యకరమైన పదం కాదని, ఈ సంఘటన వివరాలు తెలుసుకుని దానిపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డోంట్ టచ్ మీ అన్నందుకు వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.