జగన్!.. ఆ హామి సాధ్యమయ్యే పనేనా?: కానీ, ఇలా చేస్తే.. తిరుగుండకపోవచ్చు?
దీనికి సరైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వైసీపీ రూపొందించగలిగి.. దాన్ని జనాలకు వివరించగలిగితే.. జగన్ ఇచ్చిన హామి పట్ల మరింత విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది.
విజయవాడ: రెండు రోజుల వైసీపీ ప్లీనరీ ఇంకా రెండు సంవత్సరాల సమయం వేచి చూడాల్సి ఉన్న ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడుకునేలా చేసింది. అధికార పార్టీపై యుద్దం ప్రకటించేసి.. తమ భవిష్యత్తు కార్యాచరణను విధివిధానాలను ప్రకటించేసింది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలో.. జగన్ ప్రణాళికలో గానీ మొత్తానికి అప్పుడే ఎన్నికల హామిలను సైతం గుప్పించి.. వైసీపీ అందరినోటా చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ అడుగులను నిశితంగా గమనిస్తే.. జనంలో ఒక సానుకూల వైఖరిని ఏర్పరుచుకోవడానికి పార్టీ చుట్టూ ఒక ఉధృతమైన చర్చను లేవనెత్తాలనే వ్యూహం కనిపిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఒక వాడి వేడి వాతావరణాన్ని సృష్టించి.. అందులో అధికార టీడీపీపై వైసీపీదే పైచేయిగా చూసుకోవాలనే ఆలోచన స్పష్టమవుతోంది. మొత్తంగా అధికార పార్టీకి ఊపిరి సలపనివ్వకుండా తమ కార్యాచరణను ముందుకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారనేది సుస్పష్టం.
అప్పట్లో వైఎస్ కూడా!:
ఆదివారం నాటి ప్లీనరీ సమావేశంలో జగన్ ఇచ్చిన హామిలే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. తొమ్మిది హమీలతో ఆయన చేసిన ప్రకటనలో.. ఆచరణ యోగ్యమైనవి ఎన్ని? ఆచరణయోగ్యం కానివి ఎన్ని? అన్న చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా తొమ్మిదో హామి అయిన మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమలయ్యే పనేనా? అన్నది అందరి మదిలోను మెదులుతోన్న ప్రశ్న. ప్రతిపక్ష నాయకుడి హోదాలో పద్నాలుగేళ్ల క్రితం 2003లొ పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా.. అప్పట్లో మద్యపాన నిషేధంపై హామి ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు.
Recommended Video
మద్య నిషేధం చరిత్ర:
మద్యం నిషేధమనేది ఎన్నికలను ప్రభావితం చేయడంలో క్రియాశీలకంగా మారే అంశం. రాష్ట్రంలో అధిక సంఖ్యాక వర్గాలైన పేద, మధ్యతరగతి మహిళలంతా దీనికి అనుకూలం. కాబట్టే, గతంలో 1992-94ప్రాంతంలో మద్య నిషేధంపై కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీ హామిలతో జనంలోకి వెళ్లాయి. జనం ఎన్టీఆర్ వైపు నిలవడంతో.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టిన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ మద్యపానంపై నిషేధం విధించారు.
కానీ ఆ తర్వాత చంద్రబాబు రాకతో?:
ఎన్టీఆర్ తర్వాత అనూహ్య పరిణామాల నడుమ సీఎం అయిన చంద్రబాబు.. మద్య నిషేధాన్ని క్రమంగా ఎత్తేశారు. ఆ తర్వాత మద్య నిషేధం ఊసే తెరపైకి రాలేదు. చంద్రబాబు నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న రాజశేఖర్ రెడ్డి.. పాదయాత్రలో మద్య నిషేధం గురించి హామి ఇచ్చారు తప్పితే.. ఆయన కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి 2014సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సైతం మద్య నిషేధం హామి ఇచ్చింది. నిషేధం సంగతి పక్కనపెడితే.. ఇళ్ల మధ్యలోనే మద్యం దుకాణాలు వెలుస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోంది.
ఇదే మంచి తరుణం:
గత కొద్దిరోజులుగా ఏపీలో మద్యం దుకాణాలపై మహిళలంతా ఏకమై దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రతీరోజూ ఏదో ఓ చోట మహిళల నిరసన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరిపై వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని వైసీపీ పట్టుకోగలిగింది. 2019ఎన్నికల్లో ఈ అంశాన్ని బలంగా వాడుకోవాలని నిర్ణయించింది. అందుకే నిన్నటి ప్లీనరీలో ఇచ్చిన హామిల్లో మద్య నిషేధ అంశాన్ని కూడా చేర్చారు జగన్. దీని వెనుక ప్రశాంత్ కిశోర్ గ్రౌండ్ వర్క్ ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధ్యమయ్యే పనేనా?, అలా చేస్తే సక్సెస్?:
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రెవెన్యూ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన టీడీపీ కొత్త ఆదాయ మార్గాలను రూపొందించడంలో విఫలమైందన్న అభిప్రాయాలున్నాయి. ఉన్నంతలో ఎక్కువ ఆదాయం వస్తున్నది మద్యం దుకాణాల పైనే.. రెవెన్యూ లోటును పూడ్చడానికి అంతో ఇంతో ఈ ఆదాయం ఉపయోగపడుతోంది.
ఇలాంటి తరుణంలో.. మద్య నిషేధమంటే రాష్ట్ర ఖజానాకు భారీ గండిపడినట్లే. బొటాబొటి నిధులతో రాష్టాన్ని నెట్టుకురావడం అంత సులువైన పనేమి కాదు. అలా అని మద్య నిషేధాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. దీనికి సరైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వైసీపీ రూపొందించగలిగి.. దాన్ని జనాలకు వివరించగలిగితే.. జగన్ ఇచ్చిన హామి పట్ల మరింత విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. మరి జగన్ అండ్ కో.. ఈ అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.