విజయసాయి ఎఫెక్ట్: జగన్కు మైసూరా రెడ్డి ఝలక్ ఇస్తారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మైసూరా రెడ్డి క్రమంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమవుతున్నారా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఎన్నికలకు ముందు ఆయన జగన్ పార్టీలో చేరారు. అయితే, ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడ్డారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును, ఆ పార్టీ నేతలను ఏకిపారేశారు.
అనంతరం ఇటీవల ఆయన తన ఇంట్లోని శుభకార్యానికి చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో రాజకీయ ప్రాధాన్యం లేకపోయినప్పటికీ.. మైసూరా ఆయనను కలవడం చర్చనీయాంశమైంది. అలాగే పార్టీకి కూడా దూరంగా జరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అక్రమాస్తుల కేసులో జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైసీపీలో చేరారు. పార్టీ వ్యవహారాలతో పాటు అక్రమాస్తుల కేసులోను జగన్కు పలు సలహాలు, సూచనలు చేశారనే వాదనలు ఉన్నాయి. భవిష్యత్తులో రాజ్యసభకు పంపుతామన్న జగన్ హామీతోనే మైసూరా ఆ పార్టీలో చేరారని అప్పుడు ప్రచారం సాగింది.
అయితే, ఇటీవల ఆ పార్టీ తరఫున రాజ్యసభకు విజయ సాయి రెడ్డిని ఎంపిక చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా విజయ సాయిరెడ్డి పార్టీ పైన పట్టు పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైసూరా అసంతృప్తితో ఉండవచ్చునని అంటున్నారు. అయితే, రాజ్యసభ తనకే ఇస్తే ఆయన చల్లబడవచ్చునని లేదంటే జగన్కు ఝలక్ ఇవ్వవచ్చునని అంటున్నారు.