వెనక్కి: బాబుపై చేతులెత్తేశారా? పవన్ కళ్యాణ్పై దుమ్మెత్తి పోస్తున్నారు!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో ప్లేటు మార్చారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. గురువారం నాడు రాష్ట్ర రాజధానిలో పర్యటించే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగిన పవన్.. ఆ మరుసటి రోజే శుక్రవారం నాడు ప్రెస్ మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ప్రశంసల వర్షం కురిపించడం విడ్డూరమని అంటున్నారు.
రాజధాని ప్రాంత రైతుల వద్దకు వెళ్లి ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరుసటి రోజు భిన్నంగా మాట్లాడారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పవన్ కళ్యాణ్ పైన దుమ్మెత్తి పోస్తోంది. పవన్ తన పార్టీ పేరును జనసేనగా కాకుండా.. ధనసేనగా మార్చుకోవాలని వైసీపీ నేతల ఒకరు ఘాటుగా విమర్శించారు. పవన్ గురువారం మాట్లాడిన దానికి, శుక్రవారం మాట్లాడిన దానికి పొంతన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గురువారం నాడు రాజధాని ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ రైతుల తరఫున పోరాడుతానని చెప్పారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. రాజధాని కోసం మంత్రులు బలవంతంగా భూములను లాక్కోవద్దని హెచ్చరించారు. అంతేకాదు, తాను అండగా నిలబడతానని, ఇష్టం లేని రైతులు భూములు ఇవ్వవద్దని చెప్పారు.
శుక్రవారం నాటి ప్రెస్ మీట్లోను పవన్ కళ్యాణ్... నాలుగు గ్రామాల రైతులకు మద్దతుగానే మాట్లాడారు. ఉండవల్లి ప్రజలకు ప్యాకేజీ తక్కువగా ఉందని, పెనుమాకలో మూడు పంటలు పండే పొలాలున్నట్లు తెలిపారు. రైతుల నుండి బలవంతంగా తీసుకోవద్దని సూచించారు. అయితే, ఆయన మాటల్లోని వాడి, వేడి తగ్గిందని అంటున్నారు.
ప్రెస్ మీట్లో పవన్ కొంత కూల్గానే మాట్లాడారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, చంద్రబాబు పదేళ్ల పాటు అధికారంలో ఉండాలని పవన్ వ్యాఖ్యానించారు. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేస్తున్నారని నిన్న చెప్పి.. ఇవాళ అదే ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఉండమనడం ఏమిటని, అంతలోనే రైతుల పట్ల ప్రభుత్వంలో ఏమైనా మార్పు వచ్చిందా చెప్పాలని పవన్ కళ్యాణ్ను విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అయితే, రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చురకలు అంటించారు. ఏపీ రాజధాని అభివృద్ధిని ప్రాక్టికల్గా ఆలోచించాలన్నారు. హైదరాబాద్లో ఇప్పటికీ చాలా ఖాళీ స్థలాలున్నాయని తెలిపారు. సామాజిక భద్రతపై ఏం ఆలోచించారన్నారు. వైయస్ హయాంలో చాలా తప్పులు జరిగాయని, వాన్పిక్ పేరుతో భూములు లాక్కుని అభివృద్ధి చేయకుండా భూములతో వ్యాపారం చేశారని ఆరోపించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకోలేదన్నారు. ఇతర రాష్ర్టాలు ఈ డిమాండ్ చేస్తాయని ముందు తెలియదా అని నిలదీశారు. పార్లమెంటులో ఎందుకు మాటిచ్చారన్నారు. మాట తప్పితే ఏపీలో బీజేపీని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలన్నారు. తాను ఏం చేసేది ఆలోచించుకుని చెప్తానని, నిరసన తెలపడం తప్పితే తాను ఏం చేయగలనన్నారు.
చంద్రబాబు పాలన బాగుంటుందనే ఆయనకు మద్దతిచ్చినట్లు పవన్ శుక్రవారం ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే, తమకు అన్యాయం జరుగుతోందని రైతులు చెప్పారని నిన్న చెప్పిన పవన్.. ఇప్పుడు రైతులకు ప్యాకేజీ పట్ల ఒకింత సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు దాని పైన మాట్లాడటం లేదని చెబుతున్నారు.
అయితే, నిన్న రైతుల ఆవేదన విన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇప్పుడు ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి ఒకరకంగా సూచనలు చేశారని, అప్పటికీ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది చూడాలని, ఇప్పుడే విమర్శించడం సరికాదని కొందంరంటున్నారు.