కేసీఆర్కు బీజేపీ గెలుపు భయం! జీహెచ్ఎంసీ అంత ఈజీ కాదా?
హైదరాబాద్: హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. ఇది తెరాసలో ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.
హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి రామచంద్ర రావు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. వరంగల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టంతో రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కారు. టీడీపీతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతోంది.
ఇది తెరాసకు వణుకు పుట్టించే అంశమే అంటున్నారు. వామపక్ష నేతలు కూడా ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, మతతత్వ బీజేపీని వామపక్షాలు మాత్రమే ఎదుర్కోగలవని చెప్పారు. మజ్లిస్ పార్టీ కూడా రాష్ట్ర విభజనకు ముందే బీజేపీ బలపడుతుందని జోస్యం చెప్పింది.
తాజా పరిస్థితులను చూస్తుంటే బీజేపీ క్రమంగా ఎదుగుతోందని అర్థమవుతోందని అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీజేపీ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీజేపీ పుంజుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో తెరాస ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్లుగా కనిపించకపోవడంతో నిరుద్యోగులు, చదువుకున్న వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడంతో తెరాసకు జీహెచ్ఎంసీ బెంగ పట్టుకుందనే వారు లేకపోలేదు. సాధారణంగానే రాజధాని ప్రాంతంలో టీడీపీ - బీజేపీ కూటమికి బలం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ కూటమి 15 సీట్లు గెలవడమే అందుకు నిదర్శనం.
ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా బీజేపీయే గెలవడం చూస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలుపు అంత సులభం కాదనేందుకు సంకేతాలు అంటున్నారు. అందుకు తోడు కేసీఆర్ అమలు చేయలేని హామీలు ఇస్తున్నారని, ఇది కూడా తెరాసకు నష్టం కలిగిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల తెరాస ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దాని ఫలితం కూడా కనిపించడం లేదంటున్నారు.