'జగన్ ఈ సవాల్కు సిద్ధమా, తీరు మారకుంటే వైయస్సార్ కాంగ్రెస్ అంతే'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం నాడు సవాల్ విసిరారు. ఏపీలో అభివృద్ధి పైన జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందుందని కేంద్రం ప్రకటించిందని చెప్పారు.
పరిశ్రమలు, ఉపాధి కల్పన పైన జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలు తప్పని నిరూపిస్తే తాము శిక్షకు సిద్ధమని ప్రకటించారు. నిరూపించకుంటే జగన్ శిక్షకు సిద్ధపడాలన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేసే నైతిక అర్హత జగన్కు లేదన్నారు. జగన్ తీరు మారకుంటే వైసిపికి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు.
యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు: యనమల
వైయస్ జగన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ ప్రజలను, యువతను తప్పుదోవ పట్టించేందుకే ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ చాలా దోచుకున్నారన్నారు.
రాష్ట్రాన్ని దోచుకున్న వైయస్ జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. రైతులకు రూ.24వేల కోట్ల రుణాలను మాఫీ చేసామని చెప్పారు.
మహిళా సంఘాలకు రూ.10వేల కోట్లు మాఫీ చేశామన్నారు. చంద్రబాబుపై జగన్ విమర్శలు సరికాదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 21వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జగన్ అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.