ఇజ్రాయెల్కు ఆదర్స రైతులుగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ముదురుతున్న వివాదం
హైదరాబాద్: ప్రగతి సాధించిన రైతులుగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు చెందిన నలుగురు శాసనసభ్యులను ఇజ్రాయెల్ సదస్సుకు పంపించాలనే నిర్ణయంపై వివాదం ముదురుతోంది. ఈ నెల 27వ తేదీన ఇజ్రాయెల్లోని టెల్ అవైవ్లో ప్రారంభమయ్యే 19వ అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శనకు ఆ నలుగురు శాసనసభ్యులు వెళ్తున్నారు.
వారు ఆదర్శ రైతుల పేరుతో ఇజ్రాయెల్ సదస్సుకు ఆ నలుగురు శాసనసభ్యులను వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది. సేంద్రియ ఎరువుల వాడకంలో, డ్రిప్ ఇర్రిగేషన్లో వారు సాగులో వినూత్న పద్ధతులను అనుసరించినట్లు చెబుతున్నారు. అయితే, ఆ నలుగురు శాసనసభ్యులకు వ్యవసాయ నేపథ్యం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అయితే, తాము రైతులం కావడం వల్లనే ఇజ్రాయెల్ సదస్సుకు వెళుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. తామంతా వ్యవసాయ కుటుంబంలోనే పుట్టామని వారు వివరణ ఇచ్చారు. రైతులు కానివారిని ఇజ్రాయెల్ సదస్సుకు పంపుతున్నారని వస్తున్న విమర్శలపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, విద్యాసాగర్రావు సమర్థించారు.
మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టామని, మొదట రైతు, తర్వాత ఎమ్మెల్యే అని గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికీ తాము రైతులమేనని, వ్యవసాయం చేస్తున్నామని, తాము తినగా మిగిలిన పంటను అమ్ముతున్నామని ఆయన అన్నారు.
మొదటి నుంచి తమది రైతు కుటుంబం, రైతు కుటుంబంలోనే పుట్టానని, తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా వ్యవసాయం చేశానని కల్వకుంట్ల విద్యాసాగర రావు చెప్పారు. అప్పుడు ట్రాక్టర్లు లేవని, నాగళ్లతో పొలం దున్నేవాడినని ఆయన తెలిపారు.
అయితే, ఆదర్శ రైతుల ముసుగులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం సిగ్గుచేటని టీటీడీపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. మైనింగ్ వ్యాపారం చేస్తున్న కమలాకర్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విద్యాసాగర్రావు కేవలం సొంత వ్యాపారాల కోసమే వారు ఇజ్రాయెల్ వెళుతున్నారని ఆయన మంగళవారంనాడు విమర్శించారు.