నైతిక విజయమే: రేవంత్ రెడ్డి బెయిల్పై ఎపి మంత్రి రావెల
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం, జైలు నుండి విడుదల కావడం పెద్ద నైతిక విజయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు రావెల కిశోర్ బాబు అభిప్రాయపడ్డారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని, రేవంత్రెడ్డిని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కుట్రపన్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆయన బుధవారం మీడియా ప్రతినిధునలతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాటకం బట్టబయలు అయిందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని చెప్పారు.
బూటకపు స్టింగ్ ఆపరేషన్లు, ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ టేపులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గౌరవాన్ని మంటగలపాలని ప్రయత్నించారని, జగన్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో అస్థిరతకు ప్రయత్నించారని అన్నారు. చివరికి వారి కుట్ర రాజకీయాలకు వారే బలయ్యారని చెప్పారు.
చివరికి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంచలేదని, టిఆర్ఎస్ నేతలు చట్టాలు, న్యాయస్థానాలు రాజ్యాంగాలకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారని, స్టింగ్ ఆపరేషన్లు నిలబడవని న్యాయస్థానాలు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాము చెప్పిందే న్యాయం, చట్టం అంటూ నియంతృత్వ పోకడలకు పోతే ఎల్లకాలం అవి చెల్లవని అన్నారు.