ఆ ఏడుగురు మంత్రులకు బిగ్ షాక్: వేలాడుతున్న కత్తి.. ఉద్వాసన తప్పదా?
టీడీపీలోనే అంతర్గతంగా వినిపిస్తున్న వాదనల ప్రకారం.. మొత్తం ఏడుగురు మంత్రులకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సన్నమద్దమవుతున్నట్లు సమాచారం.
విజయవాడ: ఏపీ మంత్రులను కలవరపెట్టే వార్త ఒకటి ప్రస్తుతం టీడీపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. రాబోయే ఉగాది పర్వదినం సందర్బంగా కేబినెట్ లో భారీ మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రి పదవులను ఎవరు నిలబెట్టుకుంటారు? ఎవరు ఉద్వాసనకు గురవతారు? అన్న ఉత్కంఠ ఏపీ మంత్రుల్లో నెలకొంది.
టీడీపీలోనే అంతర్గతంగా వినిపిస్తున్న వాదనల ప్రకారం.. మొత్తం ఏడుగురు మంత్రులకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సన్నమద్దమవుతున్నట్లు సమాచారం. ఉద్వాసనకు గురయ్యే మంత్రుల్లో పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, మృణాళిని, రావెల కిషోర్ బాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా.. మరో మంత్రి అచ్చెన్నాయుడు మీద కూడా వేటుపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
మంత్రి నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించి సీఆర్డీఏ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఉద్వాసనకు గురయ్యే మంత్రుల స్థానంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలకు మంత్రి పదవులు ఇవ్వాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన మహ్మద్ జానీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మైనార్టీ కోటాలో కేబినెట్ లోకి తీసుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటినుంచో లోకేష్ ను మంత్రిపదవిని తీసుకుంటారన్న ఊహాగానాల నేపథ్యంలో.. ఈ దఫా లోకేష్ ను సైతం మంత్రిపదవిలోకి తీసుకుంటారని సమాచారం. మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలను లోకేష్ కు కట్టబెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.