చంద్రబాబు ముందు జగన్ వ్యూహాలు రివర్స్: అస్త్రాలన్నీ దెబ్బకొట్టాయి?
అధికార పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తున్న అస్త్రాలు అన్నీ రివర్స్ అవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసిపి పలు అస్త్రాలు సంధించింది
అమరావతి: అధికార పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తున్న అస్త్రాలు అన్నీ రివర్స్ అవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసిపి పలు అస్త్రాలు సంధించింది.
చదవండి: జగన్తో చిరంజీవి భేటీ, వైసిపిలోకి వెళ్తారని ప్రచారం: ఇదీ విషయం
కానీ దాదాపు అన్నీ వరుసగా విఫలమవుతున్నాయని అంటున్నారు. చివరకు నిన్నటి అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ చాంబర్లో నీరు కారడం కూడా వారికి ఎదురు తిరిగిందని అంటున్నారు.
పోలవరం కాల్వకు గండి
గతంలో పోలవరం కుడి కాల్వకు గండిపడింది. గండి పడిన వెంటనే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని వైసిపి అందోళనకు దిగింది. దీనిని టిడిపి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గండి పడటానికి గల కారణాలను విశ్లేషించింది. కావాలనే పోలవరం కుడి ప్రధాన కాల్వకు గండికొట్టారని నిర్ధారణకు వచ్చి ఆ మేరకు పోలీసు స్టేషన్లో జల వనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అనంతరం దీనిపై వైసిపి మౌనం వహించిందని చెబుతున్నారు.
రోజా ఇష్యూ
వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలోను వైసిపినే ఇబ్బంది పడిందని అంటున్నారు. అసెంబ్లీలో అనుచిత తీరు నేపథ్యంలో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. వైసిపి దీనిని తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నాలు చేసిందని, కానీ సభలో రోజా తీరు కూడా ఎవరూ ఆమోదించేలా లేదనేది టిడిపి వాదన. రోజాపై ఏడాది సస్పెన్షన్ విధించాక.. మరో ఏడాది సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రచారం జరిగింది. దీనిని అస్త్రంగా వినియోగించుకోవాలనుకున్నది వైసిపి. గడువు ముగియగానే ఆమెను ఇటీవల సభలోకి అనుమతించారు.
దెబ్బకొట్టిన ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా విషయంలోనూ వైసిపి తీరుపై అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. రాజీనామాలపై జగన్ వాయిదా నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఏపీకి హోదా ఇవ్వకుంటే కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల తొలిరోజునే వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ బహిరంగంగా ప్రకటించారు. కానీ ఇటీవల ప్రధాని మోడీతో భేటీ అనంతరం రాజీనామాలపై వెనక్కి తగ్గారు. అంతేకాదు, రాజీనామాలు ఇప్పుడు కాకుంటే ఆరు నెలల తర్వాత చేయవచ్చునని, రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి మద్దతిస్తామనిచెప్పి విపక్షాలకు అడ్డంగా దొరికిపోయారు. ఆయనను లెఫ్ట్, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఏకిపారేస్తున్నాయి.
అరెస్టులపై ఇలా..
సోషల్ మీడియాలో టిడిపి ఎమ్మెల్యే, శాసన మండలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇంటూరి రవికిరణ్ విషయంలోను వైసిపి అడ్డంగా దొరికిపోయిందని టిడిపి నేతలు అంటున్నారు. తొలుత రవికిరణ్కు తమకు సంబంధం లేదని, ఆ తర్వాత ఆయనను వైసిపి నేతలు కలవడం, ఆయన తప్పు చేయలేదని చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు.
లీకేజీపైనా బోర్లా పడిందని..
తాజాగా, నూతన అసెంబ్లీలోని జగన్ చాంబర్లోకి వర్షపు నీరు వచ్చిన వైసిపి బొక్కబొర్లా పడిందని టిడిపి నేతలు అంటున్నారు. జగన్ కార్యాలయంలోకి నీరు రావడంతో.. అసెంబ్లీ నిర్మాణాన్ని నాసిరకంగా చేపట్టారని, అవినీతి చోటుచేసుకుందని అందుకే లీకేజీ జరిగిందని విమర్శలకు దిగారు. ఈ వ్యవహారంపై సభాపతి కోడెల శివప్రసాద రావు తీవ్రంగా స్పందించారు. మొత్తం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. సీఐడీ అధికారులు విచారణలో అసెంబ్లీ పైభాగంలో పైపును కోసేసి ఉండటాన్ని గుర్తించారు. దాని కారణంగానే లీకేజీ జరిగిందని నిర్ధారించారు. పైపును ఎవరు కోశారన్న దిశగా దర్యాప్తు ప్రారంభించారు. సీఐడీ దర్యాప్తు ప్రారంభంకాగానే యథావిధిగా వైసిపి మౌనం దాల్చిందని అంటున్నారు. అంతేకాదు, రెండు రోజుల క్రితం ఆళ్ల నాని మాట్లాడుతూ.. లీకేజీ కోసం పైపులు కోసినవారిపై కాదని, అక్రమాలతో డబ్బులు దిగమింగిన వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు.
అందుకే..
మొత్తానికి, జగన్కు, వైసిపికి రాజకీయ పరిణితి లేకపోవడం వల్ల వరుస వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా, రాజధాని నిర్మాణంలో అంగుళం ముందుకు పడలేదని, గోదావరి పుష్కరాల్లో పలువురి మృతి తదితర విషయాల్లో మాత్రం వైసిపి.. అధికార పార్టీని చిక్కుల్లో పెట్టిందని అంటున్నారు.