బాబుపై జగన్ ఫైర్ : రైతులను పట్టించుకోకుండా.. విమానాల్లో తిరుగుతున్నాడు!
గుంటూరు : భారీ వర్షాలకు గుంటూరు జిల్లా దాచేపల్లిలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. పంట నష్టంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న జగన్.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
పలువురు రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు జగన్. ఓవైపు పంట నష్టపోయి రైతులంతా తీవ్ర ఆవేదనలో ఉంటే.. సీఎం చంద్రబాబు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాదే రైతులకు అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పటిదాకా రైతులకు అందలేదని గుర్తు చేశారు.
పంట నష్టాలకు గాను మొత్తంగా వెయ్యి కోట్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సిన అవసరముందన్నారు జగన్. ఇందులో సుమారు రూ.120కోట్లు గుంటూరు జిల్లాకే కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఓవైపు రుణాలు మాఫీ కాక, మరోవైపు కొత్త రుణాలు పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి బంగారంపై కూడా రుణాలు ఇవ్వవద్దు అంటూ చంద్రబాబు సూచిస్తుండడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. రెండు, మూడు రూపాయలకు వడ్డీ తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని జగన్ అభిప్రాయపడ్డారు. ఇంత చేసినా.. భారీ వర్షాలకు పంట చేతికి రాకుండా పోయిందన్నారు. నష్టపోయిన పంటలను చంద్రబాబు నేరుగా పరిశీలించి రైతులను పరామర్శించాలని డిమాండ్ చేశారాయన.
పంటమొక్క చేతిలో పట్టుకుని నిరసన :
దాచేపల్లిలో పర్యటన సందర్భంగా నీట మునిగిన పంటలను పరిశీలించారు జగన్. ఈ సందర్బంగా.. నీట మునిగిన కొన్ని మొక్కలను చేతబట్టుకుని, ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో జగన్ ను అనుసరిస్తూ.. రైతులు కూడా మొక్కలు చేతబట్టి నిరసన తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.