జగన్ భారీ స్కెచ్: ప్రశాంత్ కిశోర్తో రూ.250కోట్ల డీల్!, రంగంలోకి ఐపీఏసీ!
సుమారు రూ.250కోట్లు వెచ్చించి మరీ జగన్ ఆయన సేవలను వినియోగించుకోనున్నారన్న చర్చ జరుగుతోంది. జగన్ నిర్ణయం పట్ల పలువురు పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. జగన్ మాత్రం ప్రశాంత్ కిశోర్ పట్ల పూర్త
హైదరాబాద్: 2014ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమాతో బరిలో దిగిన వైసీపీ.. అనూహ్యంగా టీడీపీ చేతిలో పరాభవం చవిచూసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాల్ మనీ, రాజేశ్వరి హత్య, ఎమ్మార్వో వనజాక్షి వంటి అనేక అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశం కల్పించినప్పటికీ.. వైసీపీ వాటిని సమర్థవంతంగా ప్రయోగించలేకపోయింది.
అయినా సరే, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు జనం ముందు పెట్టడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇంతలోనే ముందస్తు ఎన్నికలు అన్న సంకేతాలు వెలువడుతుండటంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే, పార్టీకి అందుకు పూర్తి సంసిద్దంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
రూ.250కోట్లతో డీల్:
ఈ నేపథ్యంలోనే దేశంలో ఎన్నికల వ్యూహాకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ను జగన్ రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. సుమారు రూ.250కోట్లు వెచ్చించి మరీ జగన్ ఆయన సేవలను వినియోగించుకోనున్నారన్న చర్చ జరుగుతోంది. జగన్ నిర్ణయం పట్ల పలువురు పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. జగన్ మాత్రం ప్రశాంత్ కిశోర్ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి ఐపీఏసీ:
వైసీపీ ప్రచార సరళిని పూర్తిగా మార్చివేయడంతో పాటు, ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో పనిచేయనున్నట్లుగా సమాచారం. ఇందుకోసం త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మకాం పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఆయన స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి(ఐపీఏసీ) తరుపున 100మంది సభ్యుల టీమ్ వైసీపీ గెలుపు కోసం చెమటోడ్చనున్నట్లు తెలుస్తోంది.
జగన్ పేరు మారుమోగడమే లక్ష్యంగా:
ప్రత్యర్థుల వ్యూహాలు తెలుసుకోవడం, ప్రచార సరళిని ఎప్పటికప్పుడు మార్చడం, జనానికి మరింత దగ్గరయ్యే మార్గాలు వెతకడం.. మొత్తంగా జనం నోట వైసీపీ పేరు, జగన్ పేరు మారుమోగడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ అస్త్రాలు తయారుచేయనున్నారు.
అభ్యంతరం అదొక్కటే!:
కాగా, అటు బీహార్ లో మహాకూటమి గెలుపుకు, 2014లొ మోడీ గెలుపుకు ప్రశాంత్ కిశోర్ సర్వ శక్తులు ఒడ్డి వారిని గెలిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి యూపీ ఎన్నికల్లో మాత్రం ఆయన దారుణంగా విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన ఆయన.. ఆ పార్టీ దారుణ వైఫల్యాన్ని ఏమాత్రం తప్పించలేకపోయారు.
యూపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు విఫలమైనందునే వైసీపీలోని కొంతమంది నేతలు జగన్ ను వారించినట్లుగా తెలుస్తోంది. జగన్ మాత్రం ఆయనపై పూర్తి భరోసాతో రంగంలోకి దిగాల్సిందిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతవరకు దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి విషయం వెల్లడి కాకపోయినప్పటికీ.. ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరుపున పనిచేయడం మాత్రం ఖాయమేనంటున్నారు పలువురు.