జగన్ వ్యూహం మొదలైంది: అప్పుడే గెలుపు గుర్రాల వేట!, 'సర్వే' కీలకం
మోడీ-జగన్ భేటీ.. ఏపీలో పెద్ద చర్చకు తావిచ్చింది. ముఖ్యంగా తమ ప్రత్యర్థికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం పట్ల టీడీపీ అక్కసుతో ఉంది. ఈ విషయంలో మోడీని నేరుగా నిందించే ధైర్యం లేక జగన్ ను టార్గెట్ చేయాలని
అమరావతి: మోడీ-జగన్ భేటీ.. ఏపీలో పెద్ద చర్చకు తావిచ్చింది. ముఖ్యంగా తమ ప్రత్యర్థికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం పట్ల టీడీపీ అక్కసుతో ఉంది. ఈ విషయంలో మోడీని నేరుగా నిందించే ధైర్యం లేక జగన్ ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. మోడీతో భేటీ జగన్ పొలిటికల్ మైలేజీకి ఎక్కడ కలిసి వస్తుందోనన్న భయంలో టీడీపీ ఉంది.
రివర్స్: మోడీకి మద్దతుకు కారణమేమిటీ? ప్రధానితో భేటీపై మాట్లాడొద్దన్న బాబు
ఈ విషయాన్ని పక్కనపెడితే.. వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే మోడీతో భేటీ అయ్యారని పరిశీలకులు చెబుతున్నారు.
జగన్ సర్వే:
వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున గెలుపు గుర్రాలను బరిలో దించడం కోసం జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆయన ఓ అంతర్గత సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు.. వారి విజయావకాశాలు.. ద్వితీయ శ్రేణి నాయకులు.. వారి విజయావకాశాలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఇప్పటికే కొంత తెలిసింది:
సర్వేకు సంబంధించిన రిపోర్టుల్లో కొంత భాగం ఇప్పటికే జగన్ కు అందినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీలో బలమైన నాయకులను గుర్తించేందుకు జగన్ ఈ సర్వే చేయించారు. రిపోర్టుల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.
ప్లీనరి నాటికి పూర్తి చేయాలని:
త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి ఈ సర్వే రిపోర్టులు పూర్తి స్థాయిలో జగన్ కు అందనున్నాయని తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా.. పార్టీలో చేరడానికి ఆసక్తితో ఉన్నారా?, వారిని చేర్చుకోవడం పార్టీకి ఎంతమేర కలిసొస్తుంది? వంటి అంశాలను జగన్ పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
టీడీపీలో కలవరం:
మోడీతో భేటీ తర్వాత టీడీపీలో అలజడి మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పర్యటన తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన సీఎం చంద్రబాబు.. ఆరు గంటల పాటు అదృశ్యమవడం వెనుక కూడా ఇదే కారణం ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. మోడీతో భేటీలో జగన్ ఏయే అంశాలను ప్రస్తావించారన్న అంశాలను తెలుసుకునేందుకు.. ఢిల్లీలో ఆ ఆరుగంటలు చంద్రబాబు రహస్యంగా పలువురితో భేటీ అయినట్లు చెబుతున్నారు.