బాబుపై జగన్ అబద్దపు ప్రచారం: అచ్చెన్న, నిరుద్యోగులకి చినరాజప్ప శుభవార్త
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను అడగడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తామందరం ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యం అని అనుకోవద్దన్నారు. ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.
ఏపీకి ఉన్నతమైన రాజధానిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
పోస్టులు భర్తీ చేస్తాం: చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుల జాతరకు రంగం సిద్ధమవుతోంది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఏపీలోని నిరుద్యోగులకు ఓ శుభావర్త చెప్పారు. పోలీసు శాఖలోని ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు.
సోమవారం నుంచి సమావేశాలు: కోడెల
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సభాపతి కోడెల శివప్రసాద్ ఆదివారం చెప్పారు. ప్రజాధనాన్నివృథా చేయకుండా అసెంబ్లీలో సమస్యల పైన అర్థవమతమైన చర్యలు చేపట్టాలని సభ్యులకు సూచించారు.