జగన్ పత్రికలో అసత్యాలు.. : చినరాజప్ప, "చంద్రబాబు చేస్తోన్న హంగామా బ్రిటీష్ వాళ్లు కూడా చేయలేదు"
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై వస్తోన్న ఆరోపణలను తప్పబడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా దీనిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప.. వైసీపీ అధినేత జగన్ పత్రికలో రాజధాని నిర్మాణ పనులపై తప్పడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన చినరాజప్ప.. ఆ పత్రికలో వస్తోన్న కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాత్కాలిక సచివాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చిన ఆయన.. రాజధాని నిర్మాణం ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు.
కాగా.. ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం కుంగిపోయిందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని తప్పుబడుతూ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే ఉద్యోగుల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. రాజధానికి చేరుకున్న సచివాలయ ఉద్యోగులకు అక్కడి రైతులు స్వాగతం పలికినట్టుగా తెలిపారు.
"చంద్రబాబు చేస్తోన్న హంగామా బ్రిటీష్ వాళ్లు కూడా చేయలేదు"
రాజధానికి సంబంధించి ఏపీ సర్కార్ చర్యలను తప్పబడుతున్నారు ప్రతిపక్ష వైసీపీ నేతలు. బుధవారం నాడు తాత్కాలిక సచివాలయం ప్రారంభమైన నేపథ్యంలో దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్యెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
200 ఏళ్లు ఏలిన బ్రిటీష్ వాళ్లు కూడా చంద్రబాబు ప్రభుత్వం లాగా హంగామా చేయలేదని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వం అనవసర హంగామా చేస్తోందని దుయ్యబట్టిన శ్రీకాంత్ రెడ్డి.. ఇప్పటికే ప్రారంభించిన సచివాలయాన్ని ఇంకెన్ని సార్లు ప్రారంభిస్తారని నిలదీశారు.
రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేసిన ఆయన, రాజధాని నిర్మాణ బాధ్యతలను ఓ దివాళా తీసిన కంపెనీ చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు.