మోడీతో భేటీ అందుకే: జగన్కు చంద్రబాబు రివర్స్ పంచ్
రాజకీయాలు ఎప్పటికప్పుడు మలుపు తిరుగుతాయని తాజా ఎపి పరిణామాలు తెలియజేస్తున్నాయి. జగన్కు చంద్రబాబు రివర్స్ పంచ్ ఇవ్వడం ఆ విషయాన్ని తెలియజేస్తోంది.
చిత్తూరు: రాజకీయాలు ఎప్పుడు ఏ విధమైన మలుపు తిరుగుతాయనేది చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాటలను చూస్తే అది నిజమనిపించక మానదు.
ఓటుకు నోటు కేసులో రాజీపడి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవడం లేదని, కేంద్రంతో చంద్రబాబు రాజీ పడ్డారని వైయస్ జగన్ విమర్శిస్తూ వచ్చారు. తాజాగా, జగన్ నరేంద్ర మోడీతో భేటీ కావడంపై చంద్రబాబు రివర్స్ పంచ్ వేశారు.
జగన్పై ఆయన చిత్తూరు జిల్లా రొంపిచర్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు శనివారంనాడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.
కేసుల నుంచి బయటపడేందుకే..
ప్రత్యేక హోదా కోసం తన పార్టీ పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయిస్తానన్న జగన్మోహన్రెడ్డి తనపై ఉన్న ఆయా కేసుల నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సరెండర్ అయ్యారని చంద్రబాబు విమర్శించారు. తాను రాష్ట్రాభివృద్ధికోసమే ప్రత్యేక హోదా విషయంపై రాజీపడ్డానని, ప్యాకేజీకి అంగీకరించానే తప్ప వేరే ఉద్దేశం లేదని కూడా సమాధానం చెప్పుకున్నారు.
రైతులు సహకరిస్తే...
రైతులు సహకరిస్తే సంక్షోభాలను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో 2 లక్షల 50 వేల ఎకరాల్లో బిందు సేద్యానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికే అయ్యవాండ్లపల్లెలో రెండెకరాల్లో చెరువు తవ్వి..50 ఎకరాల మామిడి తోటలకు డ్రిప్తో నీటిని అందిస్తున్నామని ఆయన అన్నారు.
ఉద్యమం చేశాను...
నీరు, ప్రగతి కోసం ఉద్యమం చేశానని, ఈ ఉద్యమంలో 3,500 పనులు చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. ఒక లక్ష పంట సంజీవని కింద, పంట కుంటలు తవ్వబోతున్నట్లు తెలిపారు, నదుల అనుసంధానం వల్లే సీమకు నీరు ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో 37 శాతం తక్కువ వర్షం పడినా వ్యవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని ఆయన చెప్పారు.
చెరువులు నింపుతాం...
రూ.4 కోట్లతో చెరువులు నింపేందుకు ప్రాజెక్టు మంజూరు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రొంపిచర్లలో షాదీఖానా, రోడ్డు వెడల్ప కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఉండకూడదని, రౌడీయిజాన్ని సహించేది లేదని ఆయన అన్నారు. తిరుపతిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్, అపెరల్ పార్కులు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తున్నాయని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. విశాఖకు 15 రోజులకో ఐటీ కంపెనీ వస్తుందని ఆయన తెలిపారు.