ఉద్యమించాల్సిన సమయమన్న జగన్: 'క్విట్ ఏపీ' నినాదంతో దోపిడీ పాలకులపై!
ఆ ఉద్యమం నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుందని, ఇప్పుడు మనమంతా- మోసగాళ్లారా.. దోపిడీ పాలకులారా.. ప్రజా వంచకులారా క్విట్ ఏపీ అని ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అని అన్నారు.
హైదరాబాద్: ఏపీలో వైసీపీ దూకుడు పెంచుతోంది. నంద్యాల ఉపఎన్నికను కైవసం చేసుకుని భవిష్యత్తు రాజకీయాలను శాసించడానికి వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరును, అభ్యర్థుల ఎంపికను పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలోనే 'క్విట్ ఇండియా' నినాదాన్ని సైతం ఆ పార్టీ స్పూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 75ఏళ్లు పూర్తి చేసుకున్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్లో స్పందించారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2017
'75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్యమానికి భారతీయుడిగా సెల్యూట్ చేస్తున్నా!.. ఆ ఉద్యమం నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా- మోసగాళ్లారా.. దోపిడీ పాలకులారా.. ప్రజా వంచకులారా క్విట్ ఏపీ అని ఉద్యమించాల్సిన సమయం వచ్చింది' అని ఆయన ట్వీట్ చేశారు.
జగన్ క్విట్ ఏపీ నినాదం ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. టీడీపీ రాజకీయాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పోస్టు చేసినట్లుగా స్పష్టమవుతోంది. కాగా, ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మంత్రి లోకేష్.. జగన్ క్విట్ ఏపీ నినాదానికి కౌంటర్ ఇస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.