లెక్కలు రాకపోతే.. చెబుతా రాసుకోండి: ప్రభుత్వంపై జగన్ ఫైర్
రైతు ఆత్మహత్యల అంశంపై ప్రసంగిస్తూ.. లెక్కలు రాకపోతే తాను చెబుతానని, పెన్ను, పేపర్ తీసుకుని రాసుకోండని సభలో అధికార పక్ష సభ్యులను జగన్ ఎద్దేవా చేశారు.
అమరావతి: వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఇన్ పుట్ సబ్సిడీ అంశాలను సభలో చర్చకు లేవనెత్తారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సహా ప్రభుత్వానికి లెక్కలు వినిపించారు. మంత్రి ప్రతిపాటి పుల్లారావు అవాస్తావాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రైతు ఆత్మహత్యలు, ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో మంత్రి చెబుతున్నవి తప్పుడు లెక్కలని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం వక్రీకరిస్తోందని, రూ.87,612కోట్ల రుణాలు మాఫీ చేస్తామని హామి ఇచ్చి, ఇప్పటివరకు రూ.10వేల కోట్లు ఇవ్వలేదన్నారు.
ఈ మూడేళ్ల కాలంలో రైతులు రూ.48వేల కోట్ల వడ్డీ కట్టారని, ఏటా ప్రభుత్వం రూ.3వేల కోట్లు మాత్రమే ఇస్తే రుణాలు ఎలా తీరుతాయని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి రూ.లక్షా 36వేల 935 రుణాన్ని మాఫీ చేసినట్లుగా మంత్రి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, వాస్తవంలో మాత్రం ఆయనకు అందింది రూ.50వేలు మాత్రమేనని అన్నారు.
అది కూడా ప్రభుత్వం రెండు విడుతల్లో చెల్లించిందని, అది వడ్డీకే సరిపోలేదని అన్నారు. వడ్డీతో కలిపి ఇప్పుడా మొత్తం రూ.51వేలుగా మారిందన్నారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ జరిగిందని అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. లెక్కలు రాకపోతే తాను చెబుతానని, పెన్ను, పేపర్ తీసుకుని రాసుకోండని సభలో అధికార పక్ష సభ్యులను జగన్ ఎద్దేవా చేశారు.
జగన్ మాట్లాడుతున్న సమయంలోనే స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. దీంతో అధికారపక్ష సభ్యులు జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ కౌంటర్ ఇచ్చారు.