సీనియర్లపై అసంతృప్తి, కారణమిదే, జగన్ ప్లాన్ ఇదీ
తాను విదేశాల్లో ఉన్న సమయంలో పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుపై వైసీపీ చీఫ్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక నుండి అమరావతి కేంద్రంగానే జగన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారని పార్టీవర్గాలు.
అమరావతి: తాను విదేశాల్లో ఉన్న సమయంలో పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుపై వైసీపీ చీఫ్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక నుండి అమరావతి కేంద్రంగానే జగన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి.ఈ ఏడాది జూలై నుండి అమరావతి నుండే జగన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
15 రోజుల పాటు విదేశాల్లో పర్యటించి రెండు రోజుల క్రితమే వైసీపీ అధినేత జగన్ హైద్రాబాద్ కు తిరిగివచ్చారు. 15 రోజులపాటు రాష్ట్రంలో లేనందున చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు.
అయితే అసెంబ్లీలోని తన చాంబర్లో వర్షపునీళ్ళు వచ్చిన ఘటనపై పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుపట్ల జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు సమన్వయంతో వ్యవహరించలేదనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు.
అయితే పార్టీకి మైలేజీ వచ్చే అంశాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోయామనే భావనను ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం.అయితే భవిష్యత్తులో ఈ రకంగా జరగకూడదని ఆయన పార్టీ నాయకులకు సూచించారని సమాచారం.
అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు
అసెంబ్లీని తన ఛాంబర్ లో పైపులైన్ లీకేజీ ఘటనపై పార్టీ నాయకులు సక్రమంగా వ్యవహరించలేదని వైఎస్ జగన్ అభిప్రాయపడినట్టు సమాచారం. అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు దొరికిన అవకాశాన్ని పార్టీ నాయకులు సమక్రంగా ఉపయోగించుకోలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. తనతో సమావేశమైన పార్టీ సీనియర్ల వద్ద ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావించినట్టు సమాచారం.వేలాది కోట్లను ఖర్చుచేసి నిర్మించిన భవనాల్లో లీకేజీ ఘటనలపై ప్రభుత్వాన్నిఇరుకునపెట్టే విధంగా ఆందోళనలు చేస్తే ప్రయోజనంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఛాంబర్ ను పరిశీలించనున్న జగన్
వైఎస్ జగన్ రెండు మూడు రోజుల్లో అసెంబ్లీలోని తన చాంబర్ ను పరిశీలించనున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో వర్షానికి ఆయన చాంబర్ లో నీళ్ళు లీక్ అయ్యాయి.ఈ ఘటనపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశించింది.ఈ విచారణ సాగుతోంది. ఈ ఘటనతో వైసీపీ అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.అయితే లీకేజీకి గురైన ఛాంబర్ ను జగన్ రెండు మూడు రోజుల్లో పరిశీలించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి.
మూడురోజుల పాటు అమరావతిలోనే
వారంలో కనీసం మూడు రోజులపాటు అమరావతిలోనే ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. రానున్న రెండేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.ఈ ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటినుండే వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఇకనుండి వారంలో మూడు రోజుల పాటు జగన్ అమరావతిలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.అమరావతిలోనే ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాలు మరింత పెరిగే అవకాశాలు జూలై నుండే వారంలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు జగన్ కేటాయించనున్నారు.
మీడియాకు అందుబాటులో నేతలు
తాడేపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకొనేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటుచేస్తే అక్కడినుండే కార్యక్రమాలను నిర్వహించుకొనే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం అనుసరించే విధానాలపై తమ పార్టీ వైఖరిని వినిపించేందుకుగాను బాగా మాట్లాడగలిగే నాయకులను అమరావతిలో మీడియాకు అందుబాటులో ఉండాలని వైసీపీ చీఫ్ జగన్ కొందరుపార్టీ నాయకులకు సూచించినట్టు సమాచారం.