అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: తెలుగు రాష్ట్రాల అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని చెబుతూ పలు కొత్త సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించినప్పటికీ ఆ రాష్ట్ర నాయకులు అసంతృప్తిగానే ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంపై ప్రస్తావన లేకపోవడం వారిని ఎక్కువగా నిరాశపరిచినట్లు కనిపిస్తోంది.
బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. బడ్జెట్పై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని, బడ్జెట్ నిరాశ పరిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్ఱభుత్వం నిరాశపరిచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అసలు ఎపికి ప్రత్యేక హోదా రాకపోవడానికి టిడిపి, బిజెపిలేనని ఆయన దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచడం మాత్రం హర్షణీయమని అననారు.
రైతుల కోణంలో ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అని కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పంటల బీమా, గిట్టుబాటు ధరల వంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదని అన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు.
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని వారన్నారు. తెలంగాణకు పన్ను రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉందని వారన్నారు. తెలంగాణను విద్యా హబ్గా తయారు చేయాలని వారు డిమాండ్ చేశారు. చేవెళ్ల, - ప్రాణహిత ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వలేదని వారన్నారు. మహబూబ్నగర్, సిరిసిల్ల టెక్స్టైల్ పార్కుల ప్రస్తావన లేకపోవడాన్ని వారు తప్పు పట్టారు.