పవన్ కళ్యాణ్ ప్రకటన: టిడిపిలో ఆందోళన, జగన్కు మరో దారి లేదా?
ప్రస్తుతం అందరి చూపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పడింది. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అనంతపురం: ప్రస్తుతం అందరి చూపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పడింది. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
చిరంజీవికి అందుకే దూరమా: రెండు కోణాలు.. దటీజ్ పవన్ కళ్యాణ్!
గత ఏడాది నవంబర్ పదవ తేదీన ఆయన అనంతపురం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభిస్తామన్నారు.
జిల్లా నాయకుల్లో ఆందోళన
నాటి నుంచే పవన్ కదలికలపై చర్చ సాగుతోంది. యువతలో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆసక్తిగా మారింది. గత నవంబరు 10న జనసేన సభలో పవన్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పినప్పుడే జిల్లాకు చెందిన నాయకుల్లో ఆందోళన మొదలైంది.
ఒకరిద్దరు పవన్ కళ్యాణ్ పోటీని తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తాజాగా ఈ నెల 14న జరిగిన జనసేన పార్టీ మూడో వార్షికోత్సవం సందర్భంగా వపన్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విధాలా వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు.
పార్టీ కార్యాలయం కోసం అన్వేషణ
దీంతో జిల్లాలో పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారోననే ఆసక్తిగా మారింది. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే ఆయన వ్యక్తిగత వ్యవహారాల ఇంచార్జి రఘురామయ్య మకాం వేసి స్థలం కోసం అన్వేషిస్తున్నారు.
అనంతపురంలో ప్రారంభించేది పార్టీ రాష్ట్ర స్థాయి కార్యాలయంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు పవన్ కూడా అనంతపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2019 నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా జిల్లా నుంచి మాత్రం పోటీ ఖాయమంటున్నారు.
వైసిపి పొత్తు కుదుర్చుకుంటుందా?
తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనేందుకు వైసీపీ మరో జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని అంటున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి జాతీయ పార్టీతో జగన్ చేతులు కలిపితే టీడీపీ కూడా పవన్తో చేతులు కలిపే అవకాశాలుంటాయంటున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో పవన్ పోటీచేసే స్థానం అనంతపురమేనని ఇప్పటిదాకా చర్చల్లో ఉండగా తాజాగా కదిరి పేరు వినిపిస్తోంది. అనంతపురం నుంచి కాకుండా కదిరి నుంచి పోటీ చేస్తే జనసేన పార్టీని రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో బలోపేతం చేసుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు.
కదిరి అటు చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో ఉంది. అమరావతికి వెళ్లాలంటే కర్నూలు జిల్లా మీదుగానే వెళ్లాలి. కాబట్టి కదిరి స్థానం పైనే పవన్ దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు. మరోవైపు, గుంతకల్లులో ఆయనకు బలమైన అభిమాన సంఘం ఉంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీలా ఉంటే..
జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీలా మారితే మనుగడ కష్టమేని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం జరుగలేదు. జిల్లాల్లో జనసేనకు నాయకులెవరో తెలియదు. కమిటీలు లేవు. ఈ పరిస్థితుల్లో గత నవంబరు 10న జరిగిన బహిరంగ సభ సందర్భంగా నిర్వాహకులెవరో చివరిదాకా తేలలేదు.
పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులే చివరికి సభ ఏర్పాట్లు చూశారు. వారే జనసేన నాయకులుగా వ్యవహరించారు. గతంలో పీఆర్పీలో చిరంజీవి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యమిచ్చినట్టు విమర్శలున్నాయి.
ఇతర సామాజిక వర్గీయులు పీఆర్పీని స్వీకరించలేపోయారనే అభిప్రాయాలున్నాయి. అప్పటికే పీఆర్పీలో చేరిన కొందరు నేతలు ఆ తర్వాత ఏర్పాటైన వైసిపిలో జంప్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ పోటీకి సిద్ధమవుతున్న జనసేన పార్టీ కూడా పవన్ సామాజిక వర్గీయులకే పెద్దపీట వేస్తోందనే విమర్శలున్నాయని, అలా అయితే పీఆర్పీ అనుభవాలే పునరావృతం కాక తప్పదంటున్నారు.
పవన్ కదలికలపై టిడిపి దృష్టి
పవన్ కళ్యాణ్ కదలికలపై జిల్లా టీడీపీ నేతల దృష్టి పడింది. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలుసుకోవడానికి ఎవరికి వారు ఇప్పటి నుంచే ఆరా తీసే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు జనసేన విషయాలు తెలుసుకుంటున్నారు.