ఉత్తరాంధ్రలో జనసేన శిబిరం: మెరికల్లాంటి యువత కోసం అన్వేషణ!
వచ్చిన దరఖాస్తుల్లోంచి సరైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఉత్తరాంధ్రలో శిబిరం నిర్వహిస్తున్నారు. జనసేన మీడియా వ్యవహారాల సమన్వయ కర్త హరిప్రసాద్ ఈ విషయం వెల్లడించారు.
శ్రీకాకుళం: జనసేన పార్టీని స్థాపించి మూడేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా.. పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత అనంతపురంలో పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో పడ్డ పవన్.. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు మళ్లారు.
అనంతపురంలో నిర్వహించినట్లుగానే ప్రస్తుతం శ్రీకాకుళంలోను జనసేన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి ఏ రకమైన సేవలు అందించగలరన్న ప్రాధాన్యతపై అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంటెంట్ రైటర్స్, అనలిస్ట్స్, స్పీకర్స్ కోసం పార్టీ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుంచి జనసేనకు 6వేల దరఖాస్తులు అందాయి.
వచ్చిన దరఖాస్తుల్లోంచి సరైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఉత్తరాంధ్రలో శిబిరం నిర్వహిస్తున్నారు. జనసేన మీడియా వ్యవహారాల సమన్వయ కర్త హరిప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. ముందుగా దరఖాస్తు చేసుకోలేకపోయినవారు కూడా.. ఈ ఎంపికలో పాల్గొనవచ్చునని తెలిపారు. అయితే ఈ ఎంపిక విధానం ఎంట్రన్స్ టెస్టు లాంటిది కాదని, కేవలం ప్రతిభను గుర్తించేందుకు మాత్రమేనని చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్ లో బుధ, గురువారాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్లోను, అనంతరం 23, 24, 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ శివారులోని కొంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్లోను ఎంపిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.