ఆంధ్ర దోశపై జపాన్ గవర్నర్ ఫిదా: విశాఖ - చెన్నై కారిడార్పై ఆసక్తి
విజయవాడ: ఆంధ్ర దోశకు జపాన్ గవర్నర్ ఫిదా అయిపోయారు. చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు జపాన్ ప్రతినిధుల బృందం సోమవారం విజయవాడ చేరుకొంది.
ఈ సందర్భంగా విజయవాడలోని గేట్ వే హోటల్లో ఆ బృందానికి అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఆంధ్రా వంటకాలను జపాన్ బృందానికి రుచి చూపించారు. వారు ఎంతో ఇష్టంగా వాటిని తిన్నారు. ఇడ్లీ ,దోశ, గారె, ఉప్మా వంటకాలను వారికి వడ్డించారు. దోశ వేసిన విధానాన్ని జపాన్ గవర్నర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
కాగా, జపాన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. మత్స్య, ఫార్మా, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చింది. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పనా రంగాల్లో జపాన్ ముందుందని ఆయన అన్నారు. విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటుకు కూడా జపాన్ ముందుకు వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
విజయవాడలో తయోమో రాష్ట్ర గవర్నన్ తకకసు యిషీ, ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం పెట్టుబడులు ఉపయోగపడుతాయని ఆయన చెప్పారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు ఇది మొదటి మెట్టని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అపారమైన నీటి వనరులు ఉన్నాయని, అతిపెద్ద తీరప్రాంతం ఉందన్నారు.