ఏపీ స్మార్ట్ రాజధానికి జపాన్ సాయం, చంద్రబాబు టూర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో సహకరించేందుకు జపాన్ ముందుకు వచ్చింది. స్మార్ట్ కేపిటల్ సిటీ నిర్మాణంలో సహకరిస్తామని జపాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపింది. బుధవారం చంద్రబాబును జపాన్ ఎంబసీ ప్రతినిధులు కలిశారు.
ఈ సమావేశంలో చంద్రబాబు, జపాన్ ఎంబసీ ప్రతినిధులతో పాటు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, చంద్రబాబు ఈ ఏడాది నవంబర్ నెలలో జపాన్లో పర్యటించనున్నారు.
జపాన్ సహకారం: చంద్రబాబు
జపాన్ బృందంతో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీలో స్మార్ట్ రాజధాని నిర్మాణానికి జపాన్ బృందం ముందుకొచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖపట్నం బీచ్ రోడ్డులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయం ఘటనపై డీజీపీకి తెలంగాణ టీడీపీ ఫిర్యాదు
తెలంగాణ టీడీపీ శాసనసభ్యులు డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. నల్గొండ జిల్లాలో మంగళవారం తమ పార్టీ కార్యాలయం దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని ఆయనను కోరారు.
అంతేగాక నల్గొండ జిల్లాలో బుధవారం శాంతి యాత్రకు వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు డీజీపీకి వినతిపత్రం అందజేశారు.
నల్గొండ జిల్లా ఎస్పీ మద్దతుతోనే తోనే టీడీపీ కార్యాలయంపై తెరాస వర్గీయులు దాడి చేశారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం ఆరోపించారు. కేసీఆర్ను తృప్తిపరిచేందుకు చిన్న దొర అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లా ఎస్పీ తీరును అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. దివంగత ఎలిమినేటి మాధవ రెడ్డి చిత్రపటాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేయడం అత్యంత దారుణమన్నారు. జిల్లాలో ఆదర్శ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాధవ రెడ్డిని అవమానించిన తెరాసకు పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు.