అంతొద్దు!: బీజేపీపై జేపీ, కేంద్ర బృందంపై జేసీ ఆగ్రహం
అనంతపురం/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్రమంత్రుల పైన లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రానికి కేంద్రం నుండి భారీ ఆర్థిక సాయం వచ్చేసిందని కేంద్రమంత్రులు చెప్పడం వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయమేనని విమర్శించారు.
ఏపీ అభివృద్ధి, యువతకు ఉపాధి పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో పరిశ్రమలకు ఆదాయపు, ఎక్సైజ్ పన్ను రాయితీలను ప్రకటించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రం నుండి అవసరమైన నిధులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలన్నారు.
గతేడాది రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్లు బదలీ చేసినట్లు చెప్పారని, ఆ ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏపీకి రూ.12,500 కోట్లు రావాలని, అందులో రూ.8వేల కోట్లు ఇస్తున్నట్లు చూపిస్తూ.. ఏదో చేసినట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. ఏపీకి రెవెన్యూ లోటు పైన రోజుకో లెక్క చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. రెవెన్యూ లోటు ఎంతో స్పష్టంగా చెప్పాలన్నారు. దానిని కేంద్రం భర్తీ చేయాలన్నారు.
ఏపికి రెవెన్యూలోటు ఎంత ఉన్న కేంద్రం భర్తీ చేయాల్సిందేనని, పక్కాలెక్కలతో ఒక హక్కుగా కేంద్రం నుంచి రెవెన్యూ లోటు భర్తీని డిమాండ్ చేయడానికి అసలు లోటు ఎంత ఉందో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుండా రోజుకో లెక్క చెప్పడం సరికాదన్నారు. నవ్యాంధ్రకు ఏడు వేల కోట్ల రూపాయలు లోటు ఉండవచ్చన్నారు. పట్టిసీమతో పోలవరంను పక్కదోవ పట్టించొద్దన్నారు. నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రంపై వత్తిడి పెట్టాలన్నారు.
విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు వచ్చిన సాయం కేవలం రెవెన్యూ లోటు భర్తీకి 2300 కోట్లని, రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లని, కేంద్ర గ్రాంట్లు, ఇతర వాటాలు కాస్త ఆలస్యమైనా యథావిధిగా రావాల్సిందేనన్నారు. ఈ వాటాలను ఘనకార్యాల్లా చెప్పుకోవడం టీడీపీ, బీజేపీల రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతుంది కానీ ప్రజలకు ఏమీ ఉండదన్నారు.
కేంద్ర కరువు బృందంపై జేసీ అసహనం
కేంద్ర కరువు బృందం పైన అనంతపురం జిల్లా ఎమ్మెల్యే జీసీ ప్రభాకర్ రెడ్డి గురువారం అసహనం వ్యక్తం చేశారు. రెండు నిమిషాలు మాట్లాడితే రైతుల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. కరవు బృందం పర్యటన తూతూమంత్రంగా ఉందన్నారు. రైతు సమస్యలు వినేందుకు కూడా బృందానికి సమయం లేదా అని ప్రశ్నించారు.