బాబు పద్ధతిమార్చుకో: జేసీ హాట్, పురంధేశ్వరి హ్యాపీ
హైదరాబాద్: తెలుగదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పద్ధతిని మార్చుకోవాలని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఓ ఛానల్తో మాట్లాడారు.
కొత్త రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా పాలన పైనే దృష్టి సారించారని, పార్టీ అంతర్గత వ్యవహారాలను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీని కూడా అధినేత కొంత పట్టించుకోవాలని హితవు పలికారు.
లేకపోతే కొంతమంది వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతసేపు రాష్ట్ర అభ్యున్నతి గురించి తపిస్తున్న చంద్రబాబు తన పద్ధతిని కొంచెం మార్చుకోవాలన్నారు. తాను రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటానని చెప్పారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ... ఎన్టీఆర్ కూతురుగా పుట్టడం తన అదృష్టమన్నారు.
కాంగ్రెస్ హయాంలో తాను కేంద్రమంత్రిగా ఉన్నంత కాలంలో పార్లమెంటులో తన తండ్రి విగ్రహం పెట్టించే అవకాశం లభించిందని, అందుకు సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అందరు కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం ముందడుగు వేస్తుందన్నారు.