'తెల్లగా ఉంటే దార్శనికులు, నల్లగా ఉంటే మంచివాళ్లు కాదా?, కచ్చితంగా వివక్షే!'
దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపేలా బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు లోక్ సభలోను విపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇక తెలుగు రాష
అనంతపురం: దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపేలా బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు లోక్ సభలోను విపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోను ఈ కామెంట్స్ పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తమవుతోంది.
పవన్ కళ్యాణ్ సహా పలువురు పార్టీ నాయకులు దక్షిణాదిపై ఉత్తరాది వివక్షను ఎండగట్టారు. తాజాగా అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం దీనిపై గొంతెత్తారు. తెల్లగా ఉన్నవారంతా మంచివాళ్లు, దార్శనికులు, నల్లగా ఉన్నవారంతా మంచివాళ్లు కాదనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
దేశంలో హిందీ ప్రజలు, హిందీయేతర ప్రజలు అనే వివక్ష కచ్చితంగా ఉందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఊరు, నా ప్రాంతం, నా జిల్లా అన్న భావనలతోనే దేశంలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఇప్పటికైనా ఎలాంటి వివక్షకు తావివ్వకుండా భారతీయులంతా ఒకటే అనే భావంతో మెలగాలని జేసీ సూచించారు.
కాగా, దేశంలో అసలు జాత్యహంకారం లేదని చెబుతూ.. ఒకవేళ అదే పరిస్థితి గనుక ఉండి ఉంటే నల్లగా ఉండే దక్షిణాది వారితో ఉత్తరాది ప్రజలు కలిసుండేవారా? అని బీజేపీ ఎంపీ తరుణ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఈరోజు లోక్ సభలో దీనిపై చర్చ జరగాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే సహా మరికొంతమంది ఎంపీలు పట్టుబట్టారు. అయితే జీరో అవర్ లో దీనిపై మాట్లాడాలని క్వెషన్ అవర్ ను వృథా చేయవద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ వారికి సూచించారు. స్పీకర్ సమాధానంతో వారంతా బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.