రూ.5కి టీ తాగుతున్నారు, రూ.1కు బియ్యం ఎందుకు: జెసి సంచలనం
అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.5 పెట్టి చాయ్ కొంటున్నప్పుడు రూపాయికే చౌక ధర బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
ఆయన ఆదివారం మాట్లాడుతూ... పేదలకు రూపాయికే బియ్యం అందించడాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ టీ తాగేందుకు రూ.5 వేచ్చిస్తున్నారన్నారు. అలాంటప్పుడు కిలో బియ్యాన్ని రూపాయికే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా తగ్గాలని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తుంటారు.
చింతలపూడి ఎత్తిపోతలకు భూములు సేకరించాం: సుజాత
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు 80 శాతం భూములను సేకరించామని మంత్రి పీతల సుజాత ఆదివారం అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారన్నారు.