'దివంగత నేత, ప్రియతమ నేత అనే అరిగిపోయిన రికార్డు ఇక ఆపెయ్ జగన్'
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను జగన్ 2014లోనే వాడేసుకున్నారని, ఇప్పటికీ ఇంకా అదే పేరును పెట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని విమర్శించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ లాబీల్లో సందడి చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్ష అధినేత జగన్ మాట తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావించినప్పుడు జగన్ ఆయన్ను సంబోధించే తీరును జేసీ ఎద్దేవా చేశారు.
దివంగత నేత, ప్రియతమ నేత అనే అరిగిపోయిన రికార్డును జగన్ ఇక ఆపేయాలంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను జగన్ 2014లోనే వాడేసుకున్నారని, ఇప్పటికీ ఇంకా అదే పేరును పెట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని విమర్శించారు. ఏ ప్రాంతీయ పార్టీ అయిన ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని, లేనిపక్షంలో ఇక అధికారాన్ని దక్కించుకోవడం అసాధ్యమని అన్నారు.
కొత్త హామిలతో జగన్ జనం ముందుకెళ్తే ఏమైనా భవిష్యత్తు ఉండవచ్చునని జేసీ జగన్ కు సలహా కూడా ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆస్తికి లోకేష్ ఎలా వారసుడో.. అలాగే ఆయన రాజకీయానికి కూడా లోకేష్ వారసుడని అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా లోకేష్ గెలవడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా జేసీ స్పష్టం చేశారు.