బాబునే అలా అంటావా?: జగన్పై జేసీ దివాకర్ ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అంతమాత్రాన ముఖ్యమంత్రి హోదాను, ఆయన వయస్సును కూడా గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి బుద్ధిలేని వాడు అంటున్న జగన్.. రేపు ప్రజలు తనకు ఓట్లేయకుంటే వారిని కూడా అలాగే పిలుస్తాడా? అని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు ప్రతిపక్షాలు గెలిచిన సందర్భాలే లేవని జేసీ స్పష్టం చేశారు. టీడీపీ ఖచ్చితంగా 40నుంచి 50వేల మెజార్టీతో గెలిచి తీరుతుందని జేసీ ధీమా వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు, దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబును ఉరితీసినా తప్పులేదన్న జగన్ను లక్షసార్లు ఉరితీయాలన్నారు.