జగన్ కొడుకులాంటోడు, ఎన్టీఆర్ని తిట్టా: జేసీ, మురళీ మోహన్ కోపం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు కొడుకులాంటి వాడని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. గతంలో తాను కూడా ఎన్టీఆర్ను, హంద్రీనీవా ప్రాజెక్టును విమర్శించానని చెప్పారు.
జగన్ తనకు కొడుకులాంటివాడని, పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. అసాధ్యమనుకున్న హంద్రీనీవా ఇవాళ పూర్తవుతుందన్నారు. అన్నం లేక చనిపోతున్న వారు జిల్లాలో ఎవరు లేరన్నారు. జిల్లాకు నికర జలాలు కావాలన్నారు.
మురళీ మోహన్ ఆగ్రహం
గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లో సౌకర్యాల పైన రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్లో సౌకర్యాల పరిస్థితిని పరిశీలించి అధికారులపై మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తోటపల్లి నీటిని సీఎం విడుదల చేస్తారు: మృణాళిని
తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఈ నెల మూడో వారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి మృణాళిని తెలిపారు. జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో తోటపల్లి నిర్వాసితులు, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు వస్తాయన్నారు. రైతులకు సమస్యలు ఉంటే గనక సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.